కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై, భార్య ఆర్తితో నడుస్తున్న విడాకుల వివాదం అలాగే సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదాలు పూర్తిగా సద్దుమణిగి విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు తాను ఎలాంటి కొత్త సినిమాలు చేయనని ఆయన స్పష్టం చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయం రవి తన ఆవేదనను పంచుకుంటూ.. “నా పిల్లలను నన్ను కనీసం చూడనివ్వడం లేదు. వాళ్ల దగ్గర ఉన్న ఫోన్లను కూడా లాక్కున్నారు. చివరకు స్కూల్కి కూడా బాడీగార్డ్స్ తో పంపిస్తున్నారు. నా పిల్లలు ఈ వీడియో చూడాలి.. వాళ్ల తండ్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాడో తెలుసుకోవాలి” తనను మానసికంగా వేధించడానికే పిల్లలను దూరం పెడుతున్నారని, సోషల్ మీడియాలో తన ప్రతిష్టను దిగజార్చడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారం కొందరు పనిచేస్తున్నారు. నాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక గ్రూప్ క్రియేట్ చేసి, వాళ్లకు డబ్బులు ఇచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు తెలియవనుకుంటున్నారా? ఒక ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ వెనుక ఉండి ఈ డ్రామా అంతా నడిపిస్తోంది. గాయని కెనీషాను కూడా వెళ్లగొట్టారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయం రవి మాట్లాడిన ఆ ‘మూడక్షరాల ఇడ్లీ నటి’ (తమిళంలో ఖుష్బూ పేరు మూడు అక్షరాలు ఉండటం, తమిళనాడులో ఆమెపై ఉన్న క్రేజ్తో ఇడ్లీలకు ఆమె పేరు పెట్టడం తెలిసిందే) మరెవరో కాదు సీనియర్ నటి ఖుష్బూ సుందర్ అంటూ నెటిజన్లు, రవి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఆర్తి కుటుంబానికి ఖుష్బూ అత్యంత ఆప్తురాలు కావడంతో ఈ వివాదం వెనుక ఆమె హస్తం ఉండి ఉండవచ్చని అభిమానులు అనుమానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో కోలీవుడ్లో జయం రవి విడాకుల వివాదం మరో కొత్త మలుపు తిరిగింది.
