Tollywood : తెలుగులో విలన్స్‌గా హాలీవుడ్‌ స్టార్స్‌.. భారీగా పెరుగుతున్న బడ్జెట్స్

Tollywood

Tollywood

తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు ఖండంతరాలు దాటింది. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలుగా ముద్రపడ్డ మన సినిమాలు.. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో భారతీయ సినిమా సరిహద్దులను బద్దలు కొట్టాయి. ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ చూపు కేవలం ఇండియన్ మార్కెట్ మీదే కాదు, టోటల్ గ్లోబల్ మార్కెట్ మీద పడింది. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కోసం హాలీవుడ్, కొరియన్ స్టార్స్‌ను విలన్లుగా రంగంలోకి దించుతున్నారు. భారీ బడ్జెట్‌లతో రూపుదిద్దుకుంటున్న మన సినిమాలు ఇప్పుడు ‘పాన్ ఇంటర్నేషనల్’ సినిమాలుగా విడుదలవుతూ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో మొదలైన ట్రెండ్ : 

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో తెలుగులోకి హాలీవుడ్ నటీనటుల రాక మరింత ఊపందుకుంది. ఈ చిత్రంలో రే స్టీవెన్సన్, ఒలీవియా మోరిస్ వంటి హాలీవుడ్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ఈ సినిమా సాధించిన అంతర్జాతీయ విజయంతో పాటు ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం వంటి పరిణామాలు హాలీవుడ్ మేకర్స్ దృష్టిని సైతం టాలీవుడ్ వైపు తిప్పేలా చేశాయి.

×
×
Ad

‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్ ఆర్నాల్డ్ వోస్లూ : 

యువ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రక చిత్రంలో  హాలీవుడ్ క్లాసిక్ సిరీస్ ‘ది మమ్మీ’ లో ‘ఇమ్హోటెప్’ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా భయపెట్టిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ రణబాలిలో ‘సర్ థియోడర్ హెక్టర్’ అనే క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. దాంతో సినిమాపై అంచనాలు అంతర్జాతీయ స్థాయికి పెరిగాయి.

‘స్పిరిట్’లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ?

రెబల్ స్టార్ ప్రభాస్, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా స్పిరిట్. ఈ డార్క్ కాప్ స్టోరీలో విలన్ పాత్ర కోసం అంతర్జాతీయ నటుడిని తీసుకువస్తున్నట్లు టాక్ గట్టిగా వినిపిస్తోంది. హాలీవుడ్ మార్వెల్ చిత్రం ‘ఎటర్నల్స్’తో పాటు ‘ట్రైన్ టు బుసాన్’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా ఫేమస్ అయిన కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా తలపడనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

క్రిస్ హేమ్స్‌వర్త్ టాలీవుడ్‌లోకి వస్తున్నారా?

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ వారణాసి హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. సుమారు రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ స్టార్స్ ఒకరైన క్రిస్ హేమ్స్‌వర్త్ అంటే మనందరికీ ‘థోర్’ గా సుపరిచితుడైన 41 ఏళ్ల ఆస్ట్రేలియన్ స్టార్ — విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అటు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ  రాకా లోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేలా హాలీవుడ్ యాక్టర్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆకాశాన్నంటుతున్న బడ్జెట్లు.. పెరిగిన మార్కెట్ : 

హాలీవుడ్ నటీనటులు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు తెలుగు సినిమాల్లో భాగమవ్వడంతో నిర్మాణ వ్యయం ఊహించని రీతిలో పెరుగుతోంది. వందల కోట్ల నుంచి వేల కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే హాలీవుడ్ స్టార్స్ తోడుకావడంతో ఈ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రేజీ బిజినెస్ జరుగుతోంది. అమెరికా, యూరప్‌లతో పాటు జపాన్, కొరియా, చైనా వంటి దేశాల్లో కూడా మన సినిమాలు నేరుగా విడుదలవుతూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మొత్తానికి టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు ‘పాన్ వరల్డ్’ స్థాయికి చేరి, హాలీవుడ్‌కే సవాల్ విసిరేలా దూసుకెళ్తోంది.