(అక్టోబర్ 16న హేమామాలిని పుట్టినరోజు)
అందాలతార హేమా మాలినిని చూడగానే ‘ఏ దివిలో విరిసిన పారిజాతమో’ అనిపిస్తుంది. ‘హరివిల్లు దివినుండి దిగివచ్చినట్టూ’ భావిస్తాము. అసలు బ్రహ్మ ప్రత్యేక సృష్టి అని కూడా అనిపించక మానదు. ‘అందానికి అందం’ అన్న ఉపమానం అన్నివిధాల సరితూగే రూపం హేమా మాలిని సొంతం. ఆ నాటి నుండి ఈ నాటికీ ఎంతోమంది రసికుల స్వప్నసుందరిగా రాజ్యమేలుతూనే ఉన్నారు హేమామాలిని. ఏడు పదులు దాటినా అందమంటే ఆమెదే అనే రీతిన హేమామాలిని సాగుతూ ఉండడం విశేషం! వెండితెరపై వెలిగిపోవడమే కాదు, రాజకీయాల్లోనూ మాలిని తనదైన బాణీ పలికిస్తున్నారు. ఏమి చేసినా భారతీయులకు ‘డ్రీమ్ గర్ల్’ అనగానే గుర్తుకు వచ్చే ఏకైక సుందరి హేమామాలిని అని చెప్పక తప్పదు.
తమిళనాడులోని శ్రీరంగంలో జయలక్ష్మి, చక్రవర్తి అయ్యంగార్ దంపతులకు 1948 అక్టోబర్ 16న హేమామాలిని జన్మించారు. చెన్నైలోని ఆంధ్రమహిళా సభలో తొలుత హేమామాలిని పాఠాలు నేర్చారు. తరువాత డి.టి.ఈ.ఏ. మందిర్ లో 11వ తరగతి వరకు చదువుకున్నారు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే అభిలాషతో ఉన్నారు. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలిని తొలుత 1963లో ‘ఇదు సత్తియమ్’ చిత్రంలో “షింగారీ…” అనే పాటలో నర్తించారు. ఆ తరువాత సి.వి.శ్రీధర్ తన ‘కాదలిక్కు నేరమిల్లై’లో ఓ పాత్ర కోసం పిలిచారు. కానీ, ఆమెను చూసి శ్రీధర్ “అందంగా ఉందే తప్ప, అభినయం శూన్యం” అనడమే కాక, సినిమా రంగానికి పనికిరాదనీ తేల్చి చెప్పారు. 1965లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం ‘పాండవవనవాసము’లో “మొగలీరేకుల సిగదానా…” అనే పాటలో నర్తించారు. ఆ సినిమా టైటిల్ కార్డ్స్ లో హేమామాలిని న్యూఢిల్లీకి చెందినట్టుగా వేశారు. దేశరాజధాని చేరి అప్పటి నుంచీ హిందీ చిత్రసీమలో రాణించే ప్రయత్నం చేశారు. ఆమె అదృష్టం వల్ల తొలి హిందీ చిత్రం ‘సప్నోంకీ సౌదాగర్’లో రాజ్ కపూర్ లాంటి మేటి నటునితో నటించారు. ఆ సినిమాతోనే ‘డ్రీమ్ గర్ల్’ అన్న పేరు సంపాదించారు హేమామాలిని.
హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్ తో నటించిన వెంటనే అప్పటి స్టైలిష్ హీరో దేవానంద్ తో ‘జానీ మేరా నామ్’లో నటించారు హేమ. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో తరువాత దేవానంద్ తో కలసి “తేరే మేరే సప్నే, జోషీలా, చుప్పా రుస్తుమ్, షరీఫ్ బద్మాష్, అమిరీ గరీబ్, జానేమన్, సచ్చే కా బోల్ బాలా, అమన్ కే ఫరిస్తే” వంటి చిత్రాలలో హేమామాలిని అభినయించారు. ధర్మేంద్రతో హేమామాలిని కలసి “తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగీ, ఆలీబాబా చాలిస్ చోర్, బఘావత్, సమ్రాట్, రజియా సుల్తాన్, రాజ్ తిలక్” వంటి చిత్రాలలో నటించారు. వీరిద్దరి జోడీని జనం మెచ్చారు. వారు కూడా ఒకరికి ఒకరు నచ్చారు. దాంతో 1980లో ధర్మేంద్రను పెళ్ళాడారు హేమామాలిని.
ఇతర హీరోలతోనూ హేమామాలిని సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. “సన్యాసీ, దస్ నంబరీ, ధర్మాత్మ, అందాజ్, ప్రేమ్ నగర్, మెహబూబా, క్రాంతి, నసీబ్, సత్తే పే సత్తా, బాఘ్ బన్” వంటి విజయవంతమైన చిత్రాలలో హేమామాలిని వయసుకు తగ్గ పాత్రల్లో మురిపించారు. కొన్ని చిత్రాలలో హేమామాలిని అందం మందంగానే బంధం వేసింది. హేమామాలిని, ధర్మేంద్ర దంపతులకు ఇషా డియోల్, అహనా డియోల్ ఇద్దరు కూతుళ్ళు. ఆమె కూతుళ్ళతో కలసి అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ తన నృత్యాభినయంతో అలరిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లోని అభిమానులను తన నర్తనంతో ఆకట్టుకున్నారామె. తెలుగులో యన్టీఆర్ ‘శ్రీకృష్ణవిజయం’లోనూ “జోహారు శిఖిపింఛమౌళీ…” పాటలో నృత్యం చేశారు. ఇక బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గౌతమిగా నటించారు.
హేమామాలిని దక్షిణాది తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు కావడంతో ఆమెకు సినిమారంగంతో పాటు రాజకీయరంగంపైనా ఆసక్తి ఉండేది. 1999లో తన సహనటుడు వినోద్ ఖన్నా బీజేపీ తరపున లోక్ సభకు పోటీ చేయగా, ఆయనకు ప్రచారం నిర్వహించారు హేమామాలిని. 2003లో హేమను రాజ్యసభకు నామినేట్ చేశారు. 2009 దాకా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారామె. 2011లో బీజేపీ జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో మధుర లోక్ సభ స్థానం నుండి ఎమ్.పి.గా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 2019లో మరోమారు
గెలుపొందారు.
భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలినికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో భక్తి. ఆమె ఇస్కాన్ జీవిత సభ్యురాలు. తన నృత్యంలో ఎక్కువగా కృష్ణ భక్తి గీతాలకే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. 73 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్నా, ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తారు హేమామాలిని. అందుకు తన నృత్యాభినయమే కారణమని ఆమె చెబుతూ ఉంటారు. ఏదేమైనా, హేమామాలిని మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.