మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘దృశ్యం’ మరో రీమేక్ కు సిద్ధమవుతోంది. టాలెంటెడ్ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిగా, మోహన్ లాల్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమా భాషలు, సరిహద్దులు దాటేస్తోంది. ఇండోనేషియా లాంగ్వేజ్ లో రీమేక్ అవుతున్న ఫస్ట్ మూవీ ‘దృశ్యం’. దృశ్యం ఇప్పటికే 4 భారతీయ భాషలు, 2 విదేశీ భాషలలో రీమేక్ అయిన ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచీ మంచి స్పందన వచ్చింది. చైనీస్ భాషలోకి రీమేక్ చేసిన మొదటి మలయాళ చిత్రం కూడా ఇదే కావడం విశేషం.
‘దృశ్యం’ డిసెంబర్ 2013లో విడుదలైంది. 2014లో ఈ చిత్రం కన్నడ, తెలుగు రీమేక్లు విడుదలయ్యాయి. కన్నడ వెర్షన్ జూన్ 2014లో, తెలుగు వెర్షన్ జూలైలో విడుదలయ్యాయి. జూలై 2015లో ‘పాపనాశం’ప్ పేరుతో తమిళంలో, ‘దృశ్యం’ పేరుతో హిందీలోనూ రీమేక్ వెర్షన్లు విడుదలయ్యాయి. శ్రీలంకలో ‘ధర్మయుద్ధ’ పేరుతో ఈ చిత్రం జూలై 2017లో వచ్చింది. చైనీస్ రీమేక్ “షీప్ వితౌట్ షెపర్డ్” కూడా డిసెంబర్ 2019లో విడుదలైంది. చైనీస్ రీమేక్ విడుదలైన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం ఇండోనేషియా రీమేక్ ప్రకటించారు.
Read Also : రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలు.. చార్జిషీట్ లో సంచలన విషయాలు
అంటే దాదాపు ‘దృశ్యం’ విడుదలైన ఎనిమిది సంవత్సరాల తరువాత ఇండోనేషియాలో రీమేక్ గా విడుదల కాబోతోంది. ‘దృశ్యం’ చిత్ర నిర్మాత ఆంథోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని ఇండోనేషియాలోకి అనువదిస్తున్నట్లు ప్రకటిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఇండోనేషియాలో జకార్తాలో ఉన్న పిటి ఫాల్కన్ అనే సంస్థ నిర్మిస్తోందని ఆంటోనీ పెరుంబవూర్ అన్నారు.
ఇక ఫిబ్రవరి 2021లో ఓటిటిలో ‘దృశ్యం’ రెండవ భాగం ‘దృశ్యం 2’ విడుదలైంది. భారీ విజయం సాధించిన “దృశ్యం 2″కు కూడా తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రీమేక్లు సిద్ధమవుతున్నాయి.