Connect: నయనతారతో ‘మయూరి’, తాప్సీతో ‘గేమ్ ఓవర్’ చిత్రాలను ఇప్పటికే తెరకెక్కించారు అశ్విన్ శరవణన్. ఇప్పుడు మరోసారి ఆయన నయనతారతో హారర్ థ్రిల్లర్ మూవీ ‘కనెక్ట్’ను రూపొందించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ద్వారా ఈ సినిమా తెలుగు వర్షన్ 22వ తేదీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అశ్విన్ శరవణన్ మీడియాతో మాట్లాడారు. కథ గురించి చెబుతూ, ” లాక్ డౌన్ లో కుటుంబాలు కలిసి లేవు. ఏదో పని మీద మరో ప్రాంతానికి వెళ్లిన వాళ్లు అక్కడే స్ట్రక్ అయ్యారు. అలా ఒక కుటుంబంలోని తల్లీ కూతురు ఇంట్లో ఉండిపోతారు. కొద్ది రోజులకు కూతురి ప్రవర్తనలో అనూహ్య మార్పులు వస్తాయి. ప్రేతాత్మ ఆవహించినట్లు ఆమె బిహేవ్ చేస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో బిడ్డను తల్లి ఎలా కాపాడుకుంది అనేది ఈ సినిమా కథ. గూస్ బంప్స్ తెప్పించే హార్రర్ థ్రిల్లర్ ఇది. ఆ పాపను ఆవహించిన ఆత్మను పోగొట్టేందుకు తల్లి ఫాదర్ అగస్టీన్ హెల్ప్ కోరుతుంది. ఈ క్యారెక్టర్ లో అనుపమ్ ఖేర్ నటన ఆకట్టుకుంటుంది. ఇలాంటి క్యారెక్టర్స్ ప్రేక్షకులు నమ్మేలా ఉండాలి. ఆ సహజత్వాన్ని అనుపమ్ ఖేర్ తన నటనతో చూపించారు” అని అన్నారు.
ఈ సినిమాలో ఇంటర్వెల్ ఉండదని చెబుతూ, ”హాలీవుడ్ చిత్రాల్లో సినిమాకు ఇంటర్వెల్ ఉండదు. కథలోని ఫీల్ పోతుందని వారు విరామాలు పెట్టరు. ఒక ఫ్లోలో వెళ్తున్న కథకు విరామం ఇస్తే ప్రేక్షకులు డైవర్ట్ అవుతారు. ఈ చిత్రంలోనూ ఇంటర్వెల్ ఉండదు. హార్రర్ థ్రిల్ పంచుతూ ఏక బిగిన కథ సాగుతుంటుంది. సినిమా నిడివి గంటన్నర ఉంటుంది కాబట్టి చూడటం సులువు. ఇటీవల హిట్ అయిన చాలా సినిమాల నిడివి మూడు గంటలు ఉంది. వాటికి ఇంటర్వెల్ గంటన్నరకు ఇచ్చారు. కాబట్టి మా సినిమాను కంటిన్యూగా చూడటంలో ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు పడరని అనుకుంటున్నా. ప్రేక్షకులు ఆదరిస్తే ఇలాంటి పద్ధతిలో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. అప్పుడు థియేటర్లో ఆరేడు షోస్ ప్రదర్శించే వీలు కూడా కలుగుతుంది” అని చెప్పారు.
ఈ సినిమా తమిళ వర్షన్ ను నయనతార భర్త విఘ్నేష్ నిర్మించారు. ఆ వివరాలను తెలియచేస్తూ, ”నయనతారతో గతంలో ‘మయూరి’ అనే చిత్రాన్ని రూపొందించాను. దర్శకుడిగా నేనంటే ఆమెకు నమ్మకం. అందుకే మళ్లీ ఈ సినిమాను ఆమెతోనే చేశాను. దీన్ని ఒక అంతర్జాతీయ స్థాయి చిత్రంగా నిర్మించాలన్నది నయనతార కోరిక. అందుకే విఘ్నేష్ తో కలిసి ఆమె ప్రొడ్యూస్ చేసింది. మాకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ సమకూర్చింది. నటిగా నేను నయనతారను అడ్మైర్ చేస్తాను. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ ఆమె నటన ఆకట్టుకుంటుంది. ఆద్యంతం తన పెర్మార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఒక డిఫరెంట్ కథను చూపిస్తున్నప్పుడు నటీనటుల ఎంత ప్రామిసింగ్ గా కనిపిస్తే అంత సినిమాకు అడ్వాంటేజ్. ఆ విషయంలో నయనతార టాప్ యాక్ట్రెస్” అని చెప్పారు.
తెలుగులో నాని నటించే సినిమాలు తనకిష్టమని, గతంలో ‘మయూరి’ సినిమాను నాని ప్రొడ్యూస్ చేయాలను కున్నారని, ఆయనతో ఒక సినిమా చేయాలన్నది తన కోరిక అని అశ్విన్ శరవణన్ తెలిపారు.
