Rashmika Mandanna : సినిమా విడుదలకు ముందే సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా వేడెక్కుతోంది రష్మిక మందన్న నటించిన బోల్డ్ మూవీ ‘కాక్టెయిల్ 2’. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ను యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ పొందడంతో మరింత హాట్ టాపిక్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతున్న ‘కాక్టెయిల్ 2’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, స్టార్ హీరోయిన్ కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో రూపొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రేమను కొత్తగా చూపించబోతుందనే ప్రచారం నడుస్తోంది.
2012లో వచ్చిన హిట్ మూవీ ‘కాక్టెయిల్’ సినిమాకు ఇది సీక్వెల్ గా రాబోతోంది. అయితే సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు వచ్చిన సెన్సార్ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఈ సర్టిఫికెట్ పెద్దల కోసం మాత్రమే ఉద్దేశించిన కంటెంట్కు ఇస్తారు. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రష్మిక మందన్న కెరీర్ను పరిశీలిస్తే, ఆమెకు ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన చిత్రాలు చాలా అరుదు. గతంలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అనిమల్’ చిత్రానికి కూడా ‘ఏ’ సర్టిఫికెట్ లభించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ‘కాక్టెయిల్ 2’ కూడా అదే జాబితాలో చేరడం విశేషంగా మారింది. దీంతో రష్మిక కెరీర్లో ‘అనిమల్’ తర్వాత ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన రెండో చిత్రంగా ఇది నిలిచింది.
మరోవైపు షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్నల కలయిక కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ముఖ్యంగా రష్మిక పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ఇప్పుడు అందరి దృష్టి బాక్సాఫీస్ ఫలితాలపైనే ఉంది. ‘అనిమల్’ తర్వాత మరోసారి బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రంతో రష్మిక ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో, ‘కాక్టెయిల్ 2’ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం సెన్సార్ సర్టిఫికెట్ ఈ సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకువచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

