Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?

Nandana

Nandana

Nandana: విదేశాల్లో ఉద్యోగాల పేరిట సామాన్యులను బురిడీ కొట్టించిన వ్యవహారంలో ప్రముఖ యూట్యూబర్ నందనకు ఎట్టకేలకు చట్టం ఉచ్చు బిగిసింది. యూకేలో భారీ వేతనాలతో కొలువులు ఇప్పిస్తామంటూ కోట్ల రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో ఆమెను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసులు జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఆధారంగా ఈ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది.

సోషల్ మీడియా వేదికగా గుర్తింపు సంపాదించుకున్న నందన, ఆమె భర్తతో కలిసి ‘నందుs vlogs’ పేరిట చానల్ ప్రారంభించి వచ్చిన గుర్తింపుతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. యూకేలో ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేశారు. తీరా డబ్బులు చేతికి అందాక బాధితులకు మొండిచేయి చూపడంతో వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై భారత్‌లోనే కాకుండా అటు యూకేలోనూ వీరిపై తీవ్రస్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పటికే ఆమె లండన్‌లో తలదాచుకోవడంతో నిందితురాలిని స్వదేశానికి రప్పించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

దుబాయ్ నుంచి తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నందనను అధికారులు విమానాశ్రయం వెలుపలికి అడుగుపెట్టక ముందే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శంషాబాద్ స్థానిక పోలీసుల సాయంతో ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం ఎస్సై నేతృత్వంలోని బృందం ఆమెను కస్టడీలోకి తీసుకుంది. సుమారు పది గంటల పాటు పోలీసుల అదుపులో ఉన్నప్పటికీ నందన విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విమానాశ్రయ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, గుర్తుపట్టకుండా పూర్తిగా ముఖానికి ముసుగు వేసుకుని మీడియా కంట పడకుండా అత్యంత వేగంగా కారులోకి వెళ్ళిపోయింది. మరోవైపు నందన కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కావాలనే ఆమెపై నిరాధారమైన నిందలు మోపుతున్నారని, అసలు విచారణ పూర్తిగా ముగియక ముందే దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. చట్టంపై తమకు పూర్తి గౌరవం ఉందని, పోలీసుల విచారణకు హాజరై వాస్తవాలు నిరూపిస్తామని వారు పేర్కొంటున్నారు.