‘స్టార్ మా’ మరో సరికొత్త సీరియల్తో ముందుకు వస్తోంది. ‘ఏ దేవి వరమో నీవు’ పేరుతో తెరకెక్కిన ఈ సరికొత్త సీరియల్ జూలై 6 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్, ఆల్వాల్లోని వీబీఆర్ గార్డెన్స్లో భారీ ఎత్తున గ్రాండ్ ప్రీమియర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించింది. అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ వేడుకకు ‘గుండె నిండా గుడిగంటలు’ సీరియల్ ఫేమ్ బాలు, ఈ సీరియల్లో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రముఖ నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరోయిన్ సంజనా గల్రానితో పాటు సోనియా, శ్రవణ్లు ఈ ఈవెంట్లో సందడి చేశారు. ఎక్స్ప్రెస్ హరి తనదైన శైలిలో ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించి అందరినీ అలరించారు.
ఈ ప్రీమియర్ లాంచ్ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోసం సీరియల్ మొదటి ఎపిసోడ్ను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ సీరియల్ కథ విషయానికి వస్తే.. నమ్మిన ప్రేమికుడి చేతిలో మోసపోయిన గీతాంజలి అనే మహిళ ఒక ఆడపాపకు జన్మనిస్తుంది. అయితే ఆమె తండ్రి, అన్నయ్య ఆ పసిపాపను తమ వారసురాలిగా అంగీకరించడానికి నిరాకరించి, కఠినంగా వ్యవహరిస్తూ ఒక అనాథ ఆశ్రమంలో వదిలేస్తారు. అక్కడే ‘అంజలి’ అనే పేరుతో పెరిగి పెద్దదైన ఆ అమ్మాయి, విధి ఆడిన వింత నాటకంలో అనుకోని పరిస్థితుల మధ్య తిరిగి తన కన్నతల్లి చెంతకే చేరుకోవాల్సి వస్తుంది. మరి, కన్నకూతురు అంజలిని తల్లి గీతాంజలి గుర్తుపడుతుందా? తల్లి ప్రేమ కోసం తపించే ఆ చిన్నారికి అమ్మ ఆప్యాయత దక్కుతుందా? అనే ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ కథ సాగనుంది.

