తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ సృష్టించిన ప్రభంజనం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ సెగలు పుట్టిస్తోంది. దళపతి విజయ్ తన ‘TVK’ పార్టీతో ముఖ్యమంత్రి పీఠం దిశగా సాగిస్తున్న ప్రయాణం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కనివిని ఎరుగని రీతిలో విజయ్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. విజయ్ గెలిచిన నేపథ్యంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. తమిళనాడులో విజయ్ సాధించిన ఘనవిజయంతో సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. విజయ్ లాగే ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వచ్చి తన తాత వారసత్వాన్ని నిలబెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
గతంలోను ఇలాంటి డిస్కషన్ చాలా సార్లు వచ్చింది. అయితే ఈ విషయంలో ఎన్టీఆర్ స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని సినిమా కెరీర్పైనే ఉంచారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “నాకు ఓట్లు అవసరం లేదు.. అభిమానులు నా సినిమా టిక్కెట్లు కొంటే చాలు, నటుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని స్పష్టం చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి ఆయనకు పాలిటిక్స్లోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. తారక్ ప్రస్తుతం ‘దేవర’, ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులతో పాన్-ఇండియా రేంజ్లో బిజీగా ఉన్నారు. అయితే, విజయ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త చర్చకు దారితీసింది. ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చినా ప్రభంజనం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. మరి భవిష్యత్తులో తారక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేక నటనకే పరిమితం అవుతారా? అన్నది వేచి చూడాలి.
