టాలీవుడ్ ప్రేక్షకులకు తనదైన ఎనర్జీతో ఎంతో దగ్గరైన ప్రముఖ నటి విష్ణుప్రియ తాజాగా ‘రంభా ఊర్వశి మేనక’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర వేడుకలో పాల్గొన్న విష్ణుప్రియ, స్టేజ్ పై ఎంతో ఉత్సాహంగా, ఎమోషనల్ గా మాట్లాడారు. ముఖ్యంగా తన లుక్స్ పై తనపై తానే వేసుకున్న సెటైర్ అందరినీ ఆకర్షించింది. సినిమాలో తనను ఎంతో అందంగా చూపించిన మేకప్ అండ్ స్టైలింగ్ టీమ్ రామరెడ్డికి విష్ణుప్రియ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేను కొంచెం అబ్బాయిలా ఉంటానని మీ అందరికీ తెలుసు. అలాంటి నన్ను ఒక అందమైన అమ్మాయిలా, బ్యూటిఫుల్ గా కనిపించేలా చేశారు.. మీకు చాలా థాంక్స్” అంటూ ఆమె ఏమాత్రం మొహమాటం లేకుండా చేసిన ఈ సెల్ఫ్-ట్రోల్ కామెంట్స్ అక్కడ నవ్వులు పూయించాయి.
గత పది సంవత్సరాలుగా ఇలాంటి ఒక పెద్ద స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడాలని తాను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నానని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరిందని విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఇంత మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత రాజేష్ దండా గారికి తన పూర్వీకులు అందరూ కూడా ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతూనే ఉంటారని ఆమె అన్నారు. విష్ణుప్రియ చేసిన ఈ ‘పూర్వీకులు’ కామెంట్ పై యాంకర్ సుమ సైతం ఫన్నీగా స్పందిస్తూ.. “అసలు నీ పూర్వీకులు ఎవరని రాజేష్ గారికి డౌట్ వచ్చింది” అంటూ కౌంటర్ వేయడం ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది. సినిమా హీరో అల్లరి నరేష్ కు కూడా విష్ణుప్రియ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సాంగ్స్ షూటింగ్ సమయంలో తాను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టినా, నరేష్ గారు ఎంతో ఓపికగా, దయతో సహకరించారని గుర్తుచేసుకున్నారు. అలాగే తన కో-స్టార్ రాశి సింగ్ కు ఎంత అనుభవం ఉన్నా ఎలాంటి ఆటిట్యూడ్ చూపించకుండా తనకు ఎంతో గైడ్ చేసిందని ప్రశంసించారు. భాష రాకపోయినా సెట్ లో వందల మంది ముందు అద్భుతంగా నటించిన మరో నటి ప్రిషా గట్స్ ను ఆమె మెచ్చుకున్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డిల కామెడీ టైమింగ్ అంటే తనకు ప్రాణమని విష్ణుప్రియ తెలిపారు. మొత్తానికి తన మాటలతో ఈవెంట్ లో మంచి జోష్ నింపిన విష్ణుప్రియ.. ఈ ‘రంభా ఊర్వశి మేనక’ కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని వంద శాతం ధీమా వ్యక్తం చేశారు.

