ఎన్ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై విలేజ్ బ్యాక్డ్రాప్లో స్వచ్ఛమైన వినోదాన్ని పంచేందుకు సరికొత్త చిత్రం ‘విలేజ్ స్టార్స్’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. వెంకటగిరి వీరాంజనేయస్వామి ఆలయంలో నిర్వహించిన ఈ ముహూర్తపు వేడుకకు ప్రముఖ నటుడు సమీర్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఏ. నరేంద్ర హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒడిశా భామ లిల్లీ బళ్ళు కథానాయికగా పరిచయమవుతున్నారు. నాగూర్ ఎన్జీఆర్ ఈ చిత్రానికి ఆసక్తికరమైన కథను అందించారు.
హీరో & దర్శకుడు నరేంద్ర మాట్లాడుతూ “చిన్న చిన్న ప్రాజెక్టులతో మా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు పూర్తి స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ప్రేక్షకుల ఆశీస్సులు మా చిత్రానికి ఉండాలని కోరుకుంటున్నాను.” అన్నారు. హీరోయిన్ లిల్లీ బళ్ళు మాట్లాడుతూ “ఒడిశా నుంచి వచ్చిన నాకు తెలుగు తెరపై నటిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు నరేంద్ర గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం నన్ను ప్రేక్షకులకు దగ్గర చేస్తుందని నమ్ముతున్నాను.” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సంపత్, నటుడు రాధాకృష్ణ తదితరులు పాల్గొని నూతన ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు. త్వరలోనే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించుకోనుంది.

