స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో..
సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ సినిమాలో పని చేసినందుకు ఆనందంగా ఉంది. మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. రమేష్ గారు మా అందరినీ అద్భుతంగా చూపించారు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. కెమెరా యాంగిల్తోనే సస్పెన్స్ను క్రియేట్ చేశారు. అలా దర్శకుడు, కెమెరామెన్ కలిసి అద్భుతం చేశారు. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఉదయ భాను మాట్లాడుతూ .. ‘నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు. వశిష్ట చాలా మంచి వ్యక్తి. క్రాంతి ఎనర్జీ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. సాంచీ, మేఘన అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం. రమేష్ గారు మా అందరినీ చక్కగా చూపించారు. సత్య రాజ్ గారితో పని చేయడం మా అదృష్టం. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. ఆయన్నుంచి మేమంతా ఎంతో నేర్చుకున్నాం. ఈ చిత్రం అందరికీ కన్నుల పండువగా ఉంటుంది. అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.