నేటి పాన్ ఇండియా ట్రెండ్ లో రీజనల్ సినిమాలు ఆడవు, పాన్ ఇండియా స్కోప్ ఉంటేనే సక్సెస్ సాధిస్తాము అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలంగా ఉంది. భారీ బడ్జెట్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ తో వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా.. లోకల్ కాంటెంట్, నేటివిటీతో వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. భారీ బడ్జెట్, భారీ విజువల్స్ విజయానికి గ్యారెంటీ కాదని కొన్ని సినిమాలు నిరూపించాయి.
‘హరిహర వీరమల్లు’ ఉదాహరణగా తీసుకుంటే.. భారీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్, పాన్ ఇండియా ప్రమోషన్స్ ఉన్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విమర్శకుల అభిప్రాయం ప్రకారం కథలో బలం లేకపోవడం, విజువల్ ఎఫెక్ట్స్ సింక్ కాకపోవడం, పదే పదే వాయిదాలు పడడం సినిమాపై ప్రభావం చూపించాయి. అంటే సినిమా ఫెయిల్ కావడానికి తెలుగుదనం కారణం కాదు, కంటెంట్ బలహీనంగా ఉండటమే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ విషయంలోనూ ఇలాంటి చర్చ జరిగింది. మారుతి బలం ఎప్పుడూ రూటెడ్ కామెడీ, నేటివిటీ, ఎమోషన్స్. కానీ ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని, కథను భారీ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో సినిమా తన అసలు ఐడెంటిటీని కోల్పోయిందనే విమర్శలు వచ్చాయి. హారర్, కామెడీ, యాక్షన్ అన్నీ కలపాలని చూసినప్పుడు స్క్రీన్ ప్లే లో కన్ఫ్యూజన్ ఎక్కువయింది. ఇప్పుడు తెలుగు దర్శకులు తమ బలమైన కథలను వదిలేసి, మార్కెట్ కోసం కథలను మార్చేస్తున్నారా అనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
‘గేమ్ ఛేంజర్’ చూస్తే.. సినిమా ఫ్లాప్ కావడానికి నేటివిటీ కారణం కాదు. ఈ సినిమాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, విశాఖపట్నం బ్యాక్డ్రాప్, స్థానిక సమస్యలు, తెలుగు కుటుంబ వ్యవస్థ లాంటి అంశాలు బలంగానే ఉన్నాయి, తెలుగుదనం లోపించలేదు. కానీ కథా కథనం మూస ధోరణిలో కనిపించింది, స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేదు, నిడివి ఎక్కువైంది. ఇలాంటి అంశాలు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయాయి. దీంతో మరోసారి ఒక విషయం రుజువయింది. సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేటివి నేటివిటీ మీద ఆధారపడవు, కథను ఎంత ఆసక్తికరంగా చెప్పారన్న దానిపై ఆధారపడి ఉంటుంది.
తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళింది, వసూళ్లు పెరిగాయి, మార్కెట్ విస్తరించింది. కానీ ఈ ప్రయాణంలో తెలుగు కథలు కనుమరుగైపోతున్నాయి. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు చూస్తే.. ఆ కథలు ఆఫ్రికా, యూరప్, ఫ్యూచర్ వరల్డ్ లో జరుగుతున్నాయి. కానీ గోదావరి గ్రామాలు, పొలంగట్లు, తెలంగాణ, రాయలసీమ, తెలుగు కుటుంబాలు మాత్రం ఆ కథల్లో కనిపించడం లేదు. ఇది కాలానికి తగ్గ మార్పా లేక తెలుగుదనానికి దూరమవుతున్న సంకేతమా? ఒకప్పుడు రాజమౌళి సినిమా కథలో తెలుగు నేటివిటీ బాగా కనిపించేది. కానీ ఇప్పుడు మహేష్ బాబుతో హై బడ్జెట్ తో చేస్తున్న ‘వారణాసి’ చూస్తే.. కథ ఆఫ్రికా నుంచి అంటార్కిటికా వరకు ప్రయాణిస్తుంది. టైం ట్రావెల్, పురాణాలు, ప్రపంచాన్ని చుట్టే అడ్వెంచర్. మహేష్ బాబు తెలుగు స్టార్ అయినప్పటికీ.. ఈ సినిమాలో తెలుగు నేటివిటీ కంటే గ్లోబల్ కాన్వాస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తెలుగు కథ కంటే ప్రపంచ ప్రేక్షకుడిని ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తున్నట్టు అనిపిస్తుంది.
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న ‘రాకా’ పరిస్థితి కూడా దాదాపు ఇదే. భారీ బడ్జెట్, ఫిక్షన్ స్టోరీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్.. ఇవన్నీ కలిపి హాలీవుడ్ స్థాయి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. అట్లీ కెరీర్ లో కూడా నేటివిటీ స్టోరీస్ నుంచి యూనివర్సల్ కథల వైపు జర్నీ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకుడు చూడటానికి ఇది భారీ అనుభవమే కావచ్చు, కానీ ఇందులో తెలుగు సంస్కృతి, తెలుగు జీవితం ఎంతవరకు కనిపిస్తోందో అన్నది అసలు ప్రశ్న. ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ క్రిమినల్స్ చుట్టూ తిరుగుతుంది. హీరో ఒక పోలీస్ అధికారి, పోరాటం ప్రపంచ స్థాయి క్రైమ్ సిండికేట్స్తో. సందీప్ రెడ్డి వంగా కూడా ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మరింత యూనివర్సల్ కథల వైపు అడుగులు వేస్తున్నాడు. ప్రభాస్ కెరీర్ ని చూస్తే.. సాహో, రాధేశ్యామ్, సలార్, కల్కి, ఇప్పుడు స్పిరిట్.. ఒక్కటంటే ఒక్కటి కూడా మన తెలుగు జీవన విధానానికి దగ్గరగా ఉండే కథ కాదు. పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ పెరిగే కొద్దీ తెలుగు నేటివిటీ తగ్గిపోతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘డ్రాగన్’ కథ ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ డ్రగ్ మాఫియా, అంతర్జాతీయ కుట్రల నేపథ్యంలో సాగుతుంది. ప్రశాంత్ నీల్ ప్రపంచం కూడా కేజీఎఫ్, సలార్ తరహాలో కల్పిత సామ్రాజ్యాలు, భారీ యాక్షన్ ఎలివేషన్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్టీఆర్ లాంటి నటుడు ఉన్నా, కథ మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి వేల కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్ కోసం కథలు అల్లుతున్నారనే విషయం స్పష్టమవుతుంది.
తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలు ప్రపంచ మార్కెట్ ని టార్గెటెడ్ చేస్తూనే.. తమ మట్టి కథలను, తమ సంస్కృతిని వెండితెరపై చూపిస్తున్నాయి. రీజనల్ కథలతోనే గ్లోబల్ సక్సెస్ సాధిస్తున్నాయి. మరి టాలీవుడ్ కూడా పాన్ ఇండియా ప్రయాణంతో పాటు తెలుగు నేటివిటీని కాపాడుకుంటుందా? చూడాలి.

