మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది రెడ్ బ్యాగ్’. రవి కుమార్ సీరపు దర్శకత్వంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఆదివారం నాడు జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్కు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ప్రముఖ దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి టీజర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
“ది రెడ్ బ్యాగ్ టీజర్ చాలా అద్భుతంగా, నెక్ట్స్ లెవెల్లో ఉంది. మా కర్నూలు ప్రాంతం నుంచి వచ్చిన హరికృష్ణ నిర్మాతగా తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. ఆంధ్రప్రదేశ్లో మా ‘రెడ్ బుక్’ గురించి ఇండియా వ్యాప్తంగా ఎలాగైతే తెలుసో.. అదేవిధంగా ఈ ‘ది రెడ్ బ్యాగ్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా భారీ సౌండ్ చేయాలి. ఈ సినిమా అత్యధిక భాగం కర్నూలులోనే షూటింగ్ జరుపుకుంది. కానీ స్క్రీన్పై విజువల్స్ చూస్తుంటే మాత్రం ఫారిన్లో తీసినట్లు చాలా రిచ్గా అనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి మా హరికి భారీగా లాభాలు తీసుకురావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.

