దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్పేయీ కాంబినేషన్లో రాబోతున్న ‘ఘూస్ఖోర్ పండత్’ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్పేయీ ‘అజయ్ దీక్షిత్’ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నెట్ఫ్లిక్స్ (Netflix) కోసం రూపొందించిన వెబ్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్ విషయంలో వివాదాలు తలెత్తాయి. ఒక వర్గాన్ని కించపరచేలా ఈ పేరు ఉందంటూ దాఖలైన పిటిషన్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చిత్ర బృందంపై మండిపడింది.
Also Read : Taapsee Pannu : తప్పు పరిశ్రమది కాదు.. చూసే ప్రేక్షకులది!
అసలు విషయం ఏంటంటే.. ఒక అవినీతి పరుడికి ‘పండత్’ (పండిట్) అనే పదాన్ని జోడించడం తమ వర్గాన్ని అవమానించడమేనని బ్రాహ్మణ సంఘం ఆరోపించింది. ఈ మేరకు దర్శకుడిపై ఫిర్యాదు చేసి, సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో “సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు. ఇలాంటి పేర్లు ఆమోదయోగ్యం కావు. వెంటనే సినిమా పేరును మార్చండి” అని కోర్టు ఆదేశించింది. కొత్త టైటిల్ను కోర్టుకు తెలియజేసి, అందులో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేస్తేనే విడుదలకు అనుమతిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. మరి దీని పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
