హీరోగా కంటే వివాదాలతోనే ఎక్కువగా పేరు సంపాదించాడు తమిళ నటుడు శింబు. ప్రత్యేకించి ప్రేమ వ్యవహారాలకు ఇతగాడు పెట్టింది పేరు. అందుకే కెరీర్ లో వెనకబడ్డాడు శింబు. తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ సినిమాలో నటిస్తున్నాడు శింబు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాచి తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రంలో శింబు ముస్లిం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో ఆరు నిమిషాల నిడివి ఉన్న ఓ షాట్ ను సింగిల్ టేక్ లో చేసి శెహభాష్ అనిపించుకున్నాడు శింబు. ఈ షాట్ లో హీరోయిన్ కల్యాణి ప్రియదర్సన్ తోపాటు ఎస్.జె.సూర్య కూడా పాల్గొన్నారు. భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య వంటి దర్శకులు ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.