Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!

Idupu Kayitham

Idupu Kayitham

Idupu Kayitham : టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham). వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వైవిధ్యమైన మూవీ ఇటీవలె గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ వివాదం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్ర టైటిల్‌ను టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో పనిగట్టుకుని పెట్టిన పోస్టులు కాస్తా పెద్ద వివాదానికే దారితీశాయి. ఈ టైటిల్ కాంట్రవర్సీపై టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ తాజాగా స్పందించారు. సినిమా టైటిల్‌ను వివాదం చేస్తూ కొందరు సోషల్ మీడియాలో రచ్చ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఇలా ‘జాతీయ సమస్య’ చేసేశారంటూ మండిపడ్డారు. సినిమాను కేవలం సినిమాగానే చూడాలని, ప్రతి దానికి వివాదాలు సృష్టించడం సరికాదని హితవు పలికారు. ఇదే సమయంలో ఆయన ఇతర భాషా చిత్రాల ఉదాహరణలను ప్రస్తావించారు. “తమిళ చిత్రం ‘కరుప్పు’, కన్నడ సెన్సేషన్ ‘కాంతార’ లాంటి పదాలకు చాలామందికి అర్థాలు తెలియకపోయినా.. మన ప్రేక్షకులు ఆ సినిమాలను భారీ హిట్‌లు చేయలేదా?” అని నరేశ్ సూటిగా ప్రశ్నించారు. ఒక తెలుగు సినిమాకు విభిన్నమైన టైటిల్ పెడితే ఇలా వివాదం చేయడం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అనవసర వివాదానికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టి, మన తెలుగు భాషను, తెలుగు సినిమాలను కాపాడుకుందాం అంటూ నరేశ్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.