Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ‘మైసా’ షూటింగ్ సమయంలో గాయపడటంతో శస్త్రచికిత్స చేయించుకున్న ఆమె, ప్రస్తుతం ఇంట్లోనే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ నిశ్చితార్థ వేడుకలో భర్త విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక తొలిసారి బహిరంగంగా కనిపించడం అభిమానులకు ఊరటనిచ్చింది. అంతేకాదు ఈ వేడుకలో ఆమె కనిపించిన తీరు, విజయ్తో కలిసి ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ నిర్మాత ఎస్. నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుక ఆగస్టు 23న హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే అందరి దృష్టినీ ఆకర్షించిన జంట మాత్రం రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ ఇద్దరూ ఈ వేడుకకు జంటగా రావడంతో అక్కడి సందడి మరింత పెరిగింది. ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నవ్వుతూ కనిపించిన వీరి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వేడుకలో రష్మిక నలుపు, బంగారు రంగుల కలయికలో ఉన్న సాంప్రదాయ లెహంగాలో ఎంతో అందంగా కనిపించారు. మరోవైపు విజయ్ దేవరకొండ బ్లాక్ కుర్తాలో క్లాసీ లుక్లో కనిపించారు. కెమెరాల ముందు ఇద్దరూ ఎంతో రిలాక్స్డ్గా ఫోజులివ్వడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ముఖ్యంగా గాయానికి చికిత్స తీసుకున్న తర్వాత రష్మిక ఇలా ఉత్సాహంగా కనిపించడం అభిమానులకు ప్రత్యేకంగా అనిపించింది.
రష్మికకు ఇటీవల ‘మైసా’ సినిమా షూటింగ్ సమయంలో గాయం అయిన సంగతి తెలిసిందే. ఒక సన్నివేశంలో కుడి తుంటిలోని టెండన్ దెబ్బతిన్నట్లు ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇది తనకు వరుసగా ఎదురైన మూడో గాయం అని కూడా ఆమె పేర్కొన్నారు. మొదట ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని భావించినప్పటికీ, అభిమానులకు తన పరిస్థితి గురించి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు రష్మిక తెలిపారు.
ఆ గాయం నుంచి కోలుకోవడానికి ఆమె శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆమె పూర్తిగా కొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు కూడా. ఇక ‘మైసా’ తన కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత శారీరక శ్రమతో కూడుకున్న ప్రాజెక్ట్లలో ఒకటని రష్మిక ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాలో ఒక గోండ్ గిరిజన మహిళగా, యాక్షన్కు ప్రాధాన్యత ఉన్న పవర్ ఫుల్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.
గాయం కారణంగా కొంతకాలం షూటింగ్లకు దూరంగా ఉంటూ పూర్తిగా కోలుకోవడంపై రష్మిక దృష్టి పెట్టారు. అందుకే తాజాగా నిశ్చితార్థ వేడుకలో ఆమె కనిపించడం అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మికకు వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రణబాలి’లో మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించనున్నారు. ఇటీవల ఆమె హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’లో కనిపించారు.
మొత్తానికి గాయం, సర్జరీ కారణంగా కొంతకాలం కెమెరాలకు దూరంగా ఉన్న రష్మిక.. తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి కనిపించడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆమె పూర్తిగా కోలుకుని త్వరలోనే షూటింగ్లకు తిరిగి రావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

