భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత అరుదైన, భారీ కలయికలో ఒకటిగా నిలవబోతున్న రజినీకాంత్ – కమల్ హాసన్ల మల్టీస్టారర్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం కోసం మేకర్స్ సుమారు రూ. 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్లో సింహభాగం కేవలం ప్రధాన నటీనటులు, దర్శకుడి రెమ్యునరేషన్లకే ఖర్చవుతోందనే వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా రజినీకాంత్, కమల్ హాసన్, దర్శకుడు నెల్సన్లకు కలిపి భారీ మొత్తాన్ని పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా, త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఎన్నో దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు దిగ్గజ హీరోలు కలిసి నటిస్తుండటంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
