కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. చిత్రపరిశ్రమ స్థంబించిపోతోంది. దేశంలోని అన్ని చిత్రరంగాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీంతో పలువురు తారలు విహారయాత్రలకు బయలుదేరారు. కొందరు అప్పుడే వెళ్ళి వచ్చారు కూడా. అయితే వీరు అలా విహారయాత్రలలో మునిగి తేలుతున్న తారలు తమ తమ సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేయటంపై ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఫైర్ అవుతున్నాడు. దేశం మొత్తం కరోనాతో విలవిలలాడుతూ… ఓ వైపు జనాలు వైద్యం అందక, ఉపాధి లేక నానా ఇబ్బందులు పడుతుంటే తారలు డబ్బును మంచి నీళ్ళలా ఖర్చుపెడుతూ విందులు, విహారయాత్రలలో మునిగి తేలటం సరికాదంటున్నాడు.
అలా విహారయాత్రలకు వెళ్ళిన సెలబ్రెటీలు వయ్యారాలు పోతూ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయటం సరికాదంటున్నాడు. శ్రద్ధా కపూర్, మాధురీ దీక్షిత్, జాన్వీ కపూర్, రణ్బీర్ కపూర్-ఆలియా భట్, టైగర్ ష్రాఫ్-దిశా పటానీ వంటి వారు మాల్దీవులు చుట్టొచ్చారు. ఇక నవాజుద్దీన్కు ముందు కూడా కొందరు తారల విహారయాత్రలపై మండిపడ్డారు. ‘ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో ఉంది. వీరు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ, ఫొటోలను షేర్ చేయటంలో బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే వీరేమో డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి’ అని నవాజుద్దీన్ తన ట్వీట్ లో ఘాటుగా స్పందించాడు. మరి ఇకనైనా తారలు యాత్రలు మాని ఆ ఖర్చును కరోనా బాధితుల కోసం వెచ్చిస్తారేమో చూద్దాం.