తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెద్ద హీరోల సినిమాలు అంటే అభిమానులకు పండుగే. కానీ ఇటీవలి కాలంలో అగ్ర కథానాయకుల చిత్రాలు థియేటర్లలోకి రావడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటున్నారు. 2024లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ‘పుష్ప 2’ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రాకా’. దర్శకుడు అట్లీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ (VFX) వర్క్ కారణంగా ఆలస్యమవుతోందని వార్తలు వస్తున్నాయి. 2027లో ఈ సినిమా రిలీజ్ కావడం కూడా కష్టమేనని ఏకంగా 2028లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరందుకుంది. ‘పుష్ప 2’ విడుదలైన తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ రానుండటంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.
మరోవైపు ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’. ఈ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్లుగా 2027 జూన్ 11న విడుదల చేయడంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్కు చిత్రీకరణలో గాయం కావడంతో షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ పడింది. హెవీ యాక్షన్ షెడ్యూల్స్, విఎఫ్ఎక్స్ పనులు పెండింగ్లో ఉండటంతో ఈ మూవీ కూడా అనుకున్న సమయానికి రావడం అనుమానంగానే మారింది. ఇదే క్రమంలో ప్రభాస్ కథానాయకుడిగా హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ కూడా రకరకాల కారణాల వల్ల ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ‘పెద్ది’ చిత్రం తర్వాత ఆయన దర్శకుడు సుకుమార్తో కాంబినేషన్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కథ ఇప్పటివరకు పూర్తిగా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లోనే నిమగ్నమై ఉండటంతో ఈ కాంబో మూవీ చిత్రీకరణ ఆలస్యమై 2028 నాటికి మాత్రమే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రెండేళ్లకు ఒక సినిమా తెచ్చిన స్టార్ హీరోలు ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్కు 3 నుంచి 4 ఏళ్ల సమయం తీసుకుంటుండటంతో డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు “పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?” అని ప్రశ్నిస్తున్నారు.

