NTV Telugu Site icon

పుట్టిన రోజున పెద్ద మనసు చాటుకున్న మోహన్ లాల్!

మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ శుక్రవారం 61వ పుట్టిన రోజును జరుపుకున్నారు. నిజానికి అందులో పెద్ద విశేషం లేదు. కానీ ఈ యేడాది ఆయన పుట్టిన రోజును గతంలో కంటే కూడా భిన్నంగా ఓ గొప్ప మానవతామూర్తిగా జరుపుకున్నారు. ప్రస్తుతం కొవిడ్ 19 ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. అందులో కేరళ కూడా మినహాయింపేమీ కాదు. అయితే మల్లూవుడ్ కు చెందిన ఈ మెగాస్టార్ తన పుట్టిన రోజు సందర్భంగా తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా కేరళలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 13 హస్పిటల్స్ కు ఆక్సిజెన్ సౌకర్యం ఉన్న బెడ్స్ ను, వెంటిలేటర్స్ ను అందించారు. కరోనా సెకెండ్ వేవ్ పై ఫ్రంట్ లైన్ వారియర్స్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో మోహన్ లాల్ సైతం తనవంతు సాయం చేసే పని మొదలు పెట్టారు. రెండు వందలకు పైగా ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న 3 ఫోల్డ్ బెడ్స్ ను, 10 వెంటిలేటర్ సిస్టమ్ ఉన్న ఐసియు బెడ్స్ ను, పోర్టబుల్ ఎక్స్ రే మిషన్స్ ను హాస్పిటల్స్ కు అందించారు. అలానే ఓ మెడికల్ కాలేజీలోని రెండు వార్డులకు ఆక్సిజన్ పైప్ లైన్స్ ను కూడా విశ్వశాంతి ఫౌండేషన్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సహాయాన్ని అందుకున్న వాటిలో ప్రభుత్వ, కో-ఆపరేటివ్, ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ ఉన్నాయని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా కేరళ ప్రభుత్వ హెల్త్ కేర్ స్క్రీమ్ కిందకు వచ్చేవేనని చెప్పారు. ఇందు కోసం ఈ ఫౌండేషన్ 1.5 కోట్ల రూపాయలను వెచ్చించింది. రాబోయే రోజుల్లో విశ్వశాంతి ఫౌండేషన్ తన సేవలను కేరళ బయట ఉన్న హాస్పిటల్స్ కు కూడా అందచేస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)