Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!

Tollywood (2)

Tollywood (2)

Manoj Manchu: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు సరికొత్త సేవా విప్లవానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవ కోసం “ఐక్య ధైర్య సేన సమితి” అనే సరికొత్త సామాజిక సేవా సంస్థను వీరు అధికారికంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ప్రత్యేక సభలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సంస్థ పేరును అధికారికంగా ప్రకటించారు.

ఐదుగురు పిల్లల దత్తత.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాల విస్తరణ
ఈ సందర్భంగా సభలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్నాం. సమాజం కోసం పని చేయాలనుకునే వారందరికీ ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశంతో మౌనిక ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘ఐక్య ధైర్య సేన సమితి’. ఈ రోజు నుంచే ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి చదువు బాధ్యతలను మేము స్వీకరిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడితో ఆగవు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సమితిని విస్తరిస్తాం” అని ప్రకటించారు.

మౌనిక భూమా మంచు మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ కేవలం రక్తదానాలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థ ద్వారా మహిళలకు ‘టాయ్ మేకింగ్’ (బొమ్మల తయారీ) కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. తమ పెద్దల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రయాణానికి అందరి మద్దతు కావాలని కోరారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మంచు కుటుంబంతో తమకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, మనోజ్ హృదయం ఎప్పుడూ సమాజం కోసమే ఆలోచిస్తుందని కొనియాడారు. ఈ ట్రస్ట్‌కు తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

మంచు మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజ్ అయిన ‘మిరాయి’ చిత్రంలో మనోజ్ ‘మహాబీర్ లామా’ (బ్లాక్ స్వోర్డ్) పాత్రలో తన నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. 1897 – 1920 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ మారియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది.