Former Miss India: మాజీ మిస్‌ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్‌ క్రిష్‌’లో శర్వానంద్ సరసన ఛాన్స్!

Manasa Varanasi

Manasa Varanasi

Former Miss India: మాజీ మిస్‌ ఇండియా, తెలుగు మానస వారణాసి టాలీవుడ్‌లో తన కెరీర్‌ను మరింత బలపర్చుకునేందుకు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘దేవకీ నందన వాసుదేవ’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మానసకు.. సంతోష్‌ శోభన్‌ హీరోగా తెరకెక్కిన ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ ఏడాది వాలెంటైన్స్‌ డే సందర్భంగా విడుదలైన ఈ రొమాంటిక్‌ డ్రామాలో మానస నటనకు మంచి స్పందన లభించింది. ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ తర్వాత మానసకు వరుసగా అవకాశాలు వస్తాయని చాలామంది భావించారు. అయితే సినిమా విడుదలై సుమారు ఆరు నెలలు అవుతున్నా ఆమె కొత్త సినిమాకు సైన్‌ చేసినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం రాలేదు. ఇదే సమయంలో నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’లో మానస స్పెషల్‌ సాంగ్‌ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ అవకాశం శ్రుతి హాసన్‌కు దక్కినట్లు తర్వాత ప్రచారం జరిగింది.

అవకాశాలు తగ్గడంతో మానస సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోషూట్లు, గ్లామర్‌ కంటెంట్‌తో ప్రొఫైల్‌ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమెకు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం. శర్వానంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్‌ క్రిష్‌’ సినిమాలో మానస వారణాసి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కొంతకాలంగా రూమర్స్‌ వినిపిస్తున్నప్పటికీ.. తాజాగా ఆమె ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు సమాచారం. టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇప్పటికే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మరి ‘జార్జ్‌ క్రిష్‌’తో మానసకు ఎలాంటి గుర్తింపు వస్తుంది? ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస అవకాశాలు దక్కుతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.