Gatta Kusthi 2: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ). విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే, అసలు ఈ సెకండ్ పార్ట్ ఆలోచన ఎలా మొదలైంది, స్క్రిప్ట్ వెనుక జరిగిన కసరత్తులు ఏంటి అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెల్లా అయ్యావు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గట్ట కుస్తీ కథ ఫస్ట్ పార్ట్లోనే పూర్తిగా కంప్లీట్ అయ్యింది. అందుకే హీరో విష్ణు విశాల్ వచ్చి పార్ట్-2 చేద్దామని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ‘కథ అయిపోయింది కదా, ఇక రెండో భాగం ఎలా తీస్తాం?’ అని అన్నాను. ఆ తర్వాత ఆయనకు మరో కొత్త కథ కూడా వినిపించాను. కానీ విష్ణు మాత్రం ‘గట్ట కుస్తీ 2’ చేయడానికే మొగ్గు చూపారు. దాంతో నేను ఒక ఐడియా లైన్ అనుకుని ఆయనతో చర్చించాను. కేవలం ఒక 30 నిమిషాల డిస్కషన్ తర్వాత ఈ సీక్వెల్కు సంబంధించిన ఒక స్కెలెటన్ రెడీ అయ్యింది” అని అన్నారు.
సెకండ్ పార్ట్ గనక మొదటి భాగం రేంజ్లో లేకపోతే ప్రేక్షకులు అస్సలు ఆదరించరని విష్ణు విశాల్కి ముందే చెప్పానని డైరెక్టర్ పేర్కొన్నారు. అందుకే ముందుగా స్క్రిప్ట్పైనే పూర్తి ఫోకస్ పెట్టామని, కథ అనుకున్న విధంగా అద్భుతంగా కుదిరిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశామని అన్నారు. పార్ట్-1 నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పార్ట్-2 కచ్చితంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఫస్ట్ పార్ట్లోని నటీనటులంతా ఇందులోనూ ఉంటారని డైరెక్టర్ స్పష్టం చేశారు. కథ అక్కడి నుంచే నేరుగా కొనసాగుతుందని.. అదనంగా ఈ పార్ట్లో రమ్యకృష్ణ, యోగి బాబు, కరుణాకరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని లీక్ ఇచ్చారు. అంతేకాదు, దీని రెస్పాన్స్ని బట్టి ‘గట్ట కుస్తీ 3’పై నిర్ణయం తీసుకుంటామని, అయితే పార్ట్-3 కోసం ఎలాంటి లీడ్ సెటప్ లేదా క్లిఫ్ హాంగర్ సీన్లను ఫైనల్ కట్లో ఉంచలేదని క్లారిటీ ఇచ్చారు.
కథ ఇదే..
ఫస్ట్ పార్ట్లో తన బిడ్డపై ఒట్టు వేసి, భార్యను కచ్చితంగా ఛాంపియన్ను చేస్తానని హీరో ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ మాటను అతడు నిలబెట్టుకున్నాడా లేదా? అనే పాయింట్ చుట్టూనే ఈ ‘గట్ట కుస్తీ 2’ కథ సాగుతుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్కు సంబంధించి నెట్ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ డీల్ గురించి మాట్లాడుతూ.. “నెట్ఫ్లిక్స్ టీమ్ ఈ కథను వెంటనే ఓకే చేయలేదు. వారికి స్క్రిప్ట్ విషయంలో కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత మేము కథాలో కొన్ని కీలక మార్పులు చేసి వినిపించడంతో వారు సంతృప్తి చెంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అని చెల్లా అయ్యావు చెప్పుకొచ్చారు. సరికొత్త ఎమోషన్స్, భారీ తారాగణంతో రాబోతున్న ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి.

