బుల్లితెరపై ‘ఈటీవీ ప్రభాకర్’ అంటే తెలియని వారుండరు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా దశాబ్దాలుగా రాణిస్తున్న ఆయన వారసులు ఇప్పుడు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ టాలీవుడ్లో హీరోగా ల్యాంచ్ అవ్వగా, ఇప్పుడు ఆయన కుమార్తె వంతు వచ్చింది. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్గా చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న సరికొత్త చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా”. దినేష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరున విడుదలకు సిద్ధమవుతోంది.
కోమలి క్రియేషన్స్ బ్యానర్పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఫోక్ సింగర్, చిత్ర నిర్మాత కోమలి మాట్లాడుతూ.. సినిమా రంగంపై ఉన్న ఇష్టంతో ఎన్నో ఒడుదుడుకులను తట్టుకుని ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేశామని తెలిపారు. “ఒక ఫోక్ సింగర్గా నన్ను ఆదరించినట్లే, నిర్మాతగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు పడిన కష్టాలు, ఎదుర్కొన్న మాటల వల్ల కంటినిండా నిద్ర కూడా లేని రాత్రులు గడిపాను. అన్ని అడ్డంకులను దాటుకుని జూలైలో సినిమాను థియేటర్లలోకి తెస్తున్నాము” అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
ఈ చిత్రంలో కీలకమైన టైటిల్ పాత్రలలో సీనియర్ నటులు మురళీధర్ గౌడ్, సుధ నటించారు. వీరితో పాటు కాశీవిశ్వనాథ్, మిర్చి మాధవి, సత్యశ్రీ, ఇక్బాల్, జీవనప్రియ, గౌరీనాయుడు, హరీష్ టెక్కలి, యూట్యూబర్ సంతు ముంజెటి, హాసిని, యామిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అన్నదమ్ముల అనుబంధం, కన్నవారి విలువను చాటిచెప్పే ఈ “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రం దివిజ ప్రభాకర్కు టాలీవుడ్లో ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.

