Duniya Vijay: ప్రముఖ కన్నడ నటుడు, దర్శకుడు, నిర్మాత దునియా విజయ్ వైవాహిక జీవితానికి తెరపడింది. ఆయన భార్య నాగరత్నతో విడాకులను మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దాంపత్య వివాదానికి కోర్టు తీర్పుతో ముగింపు లభించింది. విడాకులతో పాటు నాగరత్నకు ఏకమొత్తం భరణంగా రూ.2 కోట్లు చెల్లించాలని దునియా విజయ్ను ధర్మాసనం ఆదేశించింది. ఈ మొత్తాన్ని రెండు నెలల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా భరణం చెల్లించకపోతే.. ఏటా 6 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. జస్టిస్ డి.కె.సింగ్, జస్టిస్ హెచ్.శాంతి భూషణ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
నాగరత్న ప్రస్తుత పరిస్థితులు, దంపతులకు ఉన్న ముగ్గురు పిల్లల భవిష్యత్తు, సినీ పరిశ్రమలో దునియా విజయ్ ఆర్థిక స్థితిగతులు, ఆయన హోదా తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.2 కోట్ల భరణాన్ని నిర్ణయించినట్లు కోర్టు వెల్లడించింది. గతంలో దునియా విజయ్ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే భార్యపై ఆయన పేర్కొన్న కారణాలను న్యాయస్థానం అంగీకరించలేదు. దీంతో ఆయన దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. అయితే విజయ్-నాగరత్నల మధ్య వైవాహిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, తిరిగి తన భార్యతో కలిసి జీవించేందుకు విజయ్ సుముఖంగా లేరని హైకోర్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో కేసును విచారించిన ధర్మాసనం తాజాగా వారికి విడాకులు మంజూరు చేసింది. నాగరత్న తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేదని కూడా దునియా విజయ్ తన పిటిషన్లో ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తెరపై మంచి నడవడిక, విలువలను ప్రదర్శించే ప్రజా ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాల్లోనూ వాటిని పాటించాలని సూచించింది.
అయితే ఈ తీర్పును ఇరు పక్షాలు సవాలు చేసేందుకు అవకాశం ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తదుపరి న్యాయపరమైన పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు కన్నడ చిత్రసీమలో ఆసక్తికరంగా మారింది. ఇక దునియా విజయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించారు. 2007లో విడుదలైన ‘దునియా’ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం దునియా విజయ్ దర్శకత్వంలో ఆయన కుమార్తె మోనిషా విజయ్ కుమార్ హీరోయిన్గా ‘సిటీ లైట్స్’ చిత్రం తెరకెక్కుతోంది.

