Dhanush Mythological Film: ధనుష్ హీరోగా సినిమా అంటేనే కథపై అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ బాలీవుడ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, ‘సర్దార్’ ఫేమ్ పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో ఓ భారీ పౌరాణిక అడ్వెంచర్ తెరకెక్కబోతుందనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతోంది. అడవి నేపథ్యంలో సాగే ఈ కథకు విజయేంద్ర ప్రసాద్ పేరు కూడా వినిపిస్తుండటంతో ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరిగాయి.
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘బజరంగీ భాయిజాన్’ వంటి సినిమాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ భారీ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్తో కలిసి ఆయన పనిచేయబోతున్నారనే వార్త ఈ ప్రాజెక్ట్కు హైప్ తెస్తోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో భాగమైనట్లు ఇంకా మేకర్స్ ప్రకటించలేదు. మరిన్ని వివరాలు త్వరలోనే బయటికి రానున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది. దట్టమైన అడవి నేపథ్యంలో పౌరాణిక అంశాలను కలిపి భారీ స్థాయిలో కథను చెప్పేందుకు మిథ్రన్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ సినిమాతో మిథ్రన్ హిందీ చిత్రసీమలో దర్శకుడిగా అడుగుపెట్టనున్నారు. ‘ఇరుంబు తిరై’, ‘హీరో’, ‘సర్దార్’ వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ యాక్షన్ కథలను తెరకెక్కించిన ఆయనకు ఇది పూర్తిగా భిన్నమైన ప్రయత్నం కానుంది.
మరోవైపు ఈ సినిమాలో ధనుష్ సరసన కరీనా కపూర్ నటించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల మిథ్రన్ స్వయంగా ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, డేట్స్ విషయంలో మాట్లాడుతున్నామని తెలిపారు. అంటే కరీనా కపూర్ కూడా ఇంకా ఆఫీషియల్ గా ఫైనల్ కాలేదన్నమాట. ఒకవేళ ఈ కాంబినేషన్ ఖరారైతే ధనుష్, కరీనా తొలిసారి కలిసి స్క్రీన్పై కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రస్తుతం డెవలప్మెంట్ దశలోనే ఉంది. ప్రీ ప్రొడక్షన్ పనులు 2026 చివర్లో మొదలై, షూటింగ్ 2027 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ధనుష్ లాంటి పాన్ ఇండియా స్టార్, భన్సాలీ లాంటి విజువల్ గ్రాండియర్, మిథ్రన్ లాంటి కంటెంట్ డైరెక్టర్ కాంబినేషన్కే ఇప్పటికే భారీ హైప్ వస్తోంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా తోడైతే ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకంగా మారే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథలో ధనుష్ను మిథ్రన్ ఏ రూపంలో చూపించబోతున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

