గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ‘పెద్ది’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఆయన ఒక స్ట్రెయిట్ తెలుగు ప్రాజెక్ట్ను ఒప్పుకోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భోపాల్ ఈవెంట్ సాక్షిగా రెహమాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సక్సెస్ చూశాకే తనకు తెలుగు సినిమాతో కలిసి ప్రయాణించాలనే బలమైన కోరిక కలిగిందని మనసులోని మాటను బయటపెట్టారు.
‘తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని ‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా సాధించిన ఘన విజయం, సృష్టించిన ఇంపాక్ట్ చూసిన తర్వాత.. నేను కూడా ఖచ్చితంగా ఒక మంచి తెలుగు సినిమాకు పని చేయాలి, అక్కడి మేకర్స్తో కలిసి ప్రయాణించాలి అని బలంగా అనుకున్నాను. ఆ సమయంలోనే దర్శకుడు బుచ్చిబాబు సన ‘పెద్ది’ లాంటి ఒక అద్భుతమైన, ఎమోషనల్ రస్టిక్ కథతో నా ముందుకు వచ్చారు. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అని రెహమాన్ చెప్పుకొచ్చారు. గతంలో తెలుగులో ‘నాని’, ‘కొమరం పులి’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రెహమాన్.. చాలా గ్యాప్ తర్వాత చరణ్ సినిమా కోసం ట్యూన్స్ కంపోజ్ చేశారు. నిన్నటి భోపాల్ ఈవెంట్లో ఈ సినిమా నుండి ఏకంగా రెండు పాటలను ఆయన తన టీమ్తో కలిసి స్టేజ్పై లైవ్లో పర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఊపేశారు.
