Shruti Haasan: టాలీవుడ్, కోలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రుతి హాసన్ మరోసారి తన బోల్డ్ కామెంట్స్తో వార్తల్లో నిలిచారు. సాధారణంగా చాలా మంది మాట్లాడటానికి ఇబ్బంది పడే పీరియడ్స్, నెలసరి నొప్పి, హార్మోనల్ మార్పుల గురించి ఆమె ఓపెన్గా మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు శ్రుతి ఎందుకు ఇలా అన్నారనే వివారంలోకి వెళ్తే..
రీసెంట్ గా నటి సోహా అలీ ఖాన్తో కలిసి పాల్గొన్న ఓ టాక్ షోలో శ్రుతి హాసన్ పీరియడ్స్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. నెలసరి సమయంలో కొంతమంది మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన నొప్పి, అసౌకర్యం గురించి ఆమె మాట్లాడుతూ, ఆ బాధను మగవాళ్లు కూడా ఒకసారి అనుభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారని అన్నారు. మగవాళ్లకు కూడా నెలకు ఒకసారి పీరియడ్స్ రావాలని తాను దేవుడిని కోరుకుంటుంటానని సరదాగా చెప్పారు. అలా జరిగితే షూటింగ్ కాంట్రాక్టుల్లో పీరియడ్స్ లీవ్స్ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
శ్రుతి వ్యాఖ్యలపై సోహా అలీ ఖాన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. మగవాళ్లకు పీరియడ్స్ వస్తే ఎవరికెంత బ్లీడింగ్ అయింది, ఎవరి టాంపాన్ సైజ్ పెద్దది అనే విషయంలో కూడా పోటీ పడే అవకాశం ఉందంటూ సరదాగా చమత్కరించారు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదే సమయంలో తన కెరీర్ స్టార్టింగ్ డేస్ లో షూటింగ్ సెట్స్లో ఎదురైన అనుభవాలను కూడా శ్రుతి గుర్తుచేసుకున్నారు. అప్పట్లో పీరియడ్ క్రాంప్స్ గురించి సెట్లో మాట్లాడటానికి కూడా తాను చాలా భయపడేదాన్నని చెప్పారు. తన ఎనర్జీ ఎందుకు తగ్గింది, తాను ఎందుకు మామూలుగా కనిపించడం లేదనే విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేకపోయేవారని ఆమె తెలిపారు.
ఒకసారి తన కోస్టార్ మోకాలి సర్జరీ చేయించుకున్నప్పుడు, ఆయనకు ఇబ్బంది లేకుండా షూటింగ్ టీమ్ మొత్తం కొన్ని రూల్స్ను మార్చిందని శ్రుతి చెప్పారు. అదే సమయంలో తాను తీవ్రమైన పీరియడ్ క్రాంప్స్తో బాధపడుతున్నప్పటికీ దాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత కూతురు ఉన్న ఓ దర్శకుడికి తన పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన అర్థం చేసుకుని షూటింగ్ను అడ్జస్ట్ చేశారని తెలిపారు. ఇలాంటి అనుభవాలే మహిళల పీరియడ్స్ గురించి మరింత ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరాన్ని తనకు తెలియజేశాయని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే శ్రుతి హాసన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవల సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ సినిమాలో నటించారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, ఆమిర్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకుంది. అదే సమయంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన ‘పెద్ది’ సినిమాలో హెలెలో అనే స్పెషల్ సాంగ్తోనూ శ్రుతి సందడి చేశారు. ప్రస్తుతం మిస్కిన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘ట్రైన్’ సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ కాంబినేషన్లో ఓ తెలుగు ప్రాజెక్ట్లోనూ ఆమె నటిస్తున్నట్లు సమాచారం.

