‘వినాయకుడు’, కల్ట్ క్లాసిక్ ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు సూర్య తేజ్. కెమెరా ముందు తనదైన నటనతో మెప్పించిన ఈ యాక్టర్, ఇప్పుడు ఒక సరికొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” ఆలయ వైభవాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా అక్షరబద్ధం చేసి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి రచయితగా సూర్య తేజ్ అరుదైన ఘనత సాధించారు. తన తొలి పుస్తకమైన ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ని కేవలం ఒక భక్తి పుస్తకంగానో లేదా సంప్రదాయ కథనంగానో కాకుండా.. జీవితాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఎదుర్కోవాలో వివరించే మార్గదర్శిగా ఆయన మలిచారు.
“గణపతి అంటేనే జ్ఞానానికి ప్రతీక.. ఆ ఓర్పు, జ్ఞానంతో మన నిత్య జీవితంలోని సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు” అనే అద్భుతమైన కోణాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. ఇటీవలే రీ-రిలీజ్ అయిన ‘శంభో శివ శంభో’ ఘన విజయం సాధించిన సంతోషంలో ఉన్న సూర్య తేజ్కు, రచయితగా మారడం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని వెల్లడించారు. తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ సూర్య తేజ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారితో సన్నిహితంగా ఉంటూ, ఆయన ప్రవేశపెట్టిన దార్శనిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని రాబోయే రోజుల్లో భారతీయ రైతులు, గ్రామీణ యువత ఆర్థికంగా ఎలా బలపడాలి? అందుకు ఉపయోగపడే పటిష్టమైన విధానాలు ఏమిటి? అనే సామాజిక అంశాలపై మరిన్ని పుస్తకాలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

