ప్రస్తుతం టాలీవుడ్ కొన్ని సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గతకొన్నిరోజుల నుంచి ఏపీ లో టిక్కెట్ ధరల విషయమై చర్చ నడుస్తున్న విషయం విదితమే. ఏపీ ప్రభుత్వం ఏపీ టిక్కెట్ రేట్లు తగ్గించడంపై టాలీవుడ్ అసహనం వ్యక్తం చేయడం, పలువురు ప్రముఖులు ట్విట్టర్ లో తమ అభిప్రాయాన్ని తెలపడం. ఇక వాటన్నింటిని ఆపడానికి ఇండస్ట్రీ పెద్దగా కాకుండా ఇండస్ట్రీ బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ ని కలవడం జరిగాయి. ఆ సమావేశంలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను వివరించారు. సినిమా టిక్కెట్ రేట్ల విషయమై మరోసారి ఆలోచించాలని, కరోనా సమయంలో బాగా నష్టపోయిన కళాకారులను ఆదుకోవాలని సీఎం జగన్ గారిని కలిసి మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకొంటాను అని చిరు చెప్పారు. అంతేకాకుండా ఈ విషయమై ఇండస్ట్రీలో ఎవరిని మాట్లాడవద్దని తెలిపారు.
ఇకపోతే ఈ సమస్యకు ఏదోవిధంగా చెక్ పెట్టాలనే దృఢ నిశ్చయంతో చిరు ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరు మరోసారి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఈ మీటింగ్ గత వారమే జరగాల్సి ఉండగా చిరు కరోనా బారిన పడడంతో వాయిదా పడిందని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10 న ఈ మీటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీలో చిరు మరోసారి ఏపీ సినిమా టిక్కెట్ల విషయం గురించి చర్చించనున్నారు. అంతేకాకుండా సీఎం ని కలిసేముందు సినీ ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకొని సీఎం వద్ద వాటిని కూడా ప్రస్తావించాలని చూస్తున్నారట చిరు. మరి ఈసారైనా చిరు ప్రయత్నం ఫలిస్తుందా..? లేదా ..? అనేది చూడాలి.