తమిళనాడులో విజయ్ తన పార్టీ TVK తో జయకేతనం ఎగురవేసిన తర్వాత, సినిమా తారల రాజకీయ ప్రభావంపై చర్చ మళ్ళీ మొదలైంది. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ముగ్గురు లెజెండ్స్ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ తమకు దక్కిన సువర్ణ అవకాశాన్ని ఎలా వదులుకున్నారనే దానిపై విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవికి 18 సీట్లు దక్కినప్పటికీ, రెండు బలమైన పార్టీలను ఎదుర్కొని ఆ మాత్రం సాధించడం గొప్ప విషయమని అప్పట్లో భావించారు. అయితే, అనూహ్యంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపింది. ఒకవేళ చిరు మరికొంత కాలం వేచి ఉండి ఉంటే, ఇప్పుడు జనసేన చూపిస్తున్న ప్రభంజనం కంటే రెట్టింపు స్థాయిలో ఫలితాలు ఉండేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించి, అనారోగ్యం, ఇతర వ్యక్తిగత కారణాలతో అంతే వేగంగా తప్పుకున్నారు. ఇది ఆయన అభిమానులకు తీరని నిరాశను మిగిల్చింది.
ఇక కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ విఫలమయ్యారు. చివరికి డీఎంకే, కాంగ్రెస్లకు మద్దతు ఇచ్చి వెనుక సీటుకు పరిమితమయ్యారు. కానీ విజయ్, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో భిన్నంగా కనిపిస్తున్నారు. విజయ్ తన ‘జన నాయగన్’ తర్వాత సినిమాలకు పూర్తిస్థాయిలో గుడ్ బై చెప్పేసి ప్రజాసేవకే అంకితమయ్యారు. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నిధుల కోసం కొన్ని సినిమాలు చేసినప్పటికీ, తన పూర్తి ప్రాధాన్యత రాజకీయాలకే ఇస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తం మీద, సినిమాల్లో నెగ్గిన ఈ ముగ్గురు లెజెండ్స్ రాజకీయాలొ మాత్రం తమ ముద్రను బలంగా వేయలేకపోయారు.
