Vivienne Pitt : బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కుటుంబ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ముగ్గురు పిల్లలు తమ పేర్ల నుంచి ‘పిట్’ ఇంటిపేరును తొలగించే నిర్ణయం తీసుకోగా, ఇప్పుడు వారి చిన్న కుమార్తె వివియెన్ కూడా అదే దారిలో నడుస్తోంది. దీంతో బ్రాడ్ పిట్ ఇంటిపేరును చట్టబద్ధంగా తొలగించేందుకు ముందుకొచ్చిన నాలుగో సంతానంగా ఆమె నిలిచింది. ఈ పరిణామం హాలీవుడ్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం వివియెన్ 2026 జూలై 21న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన పేరును ‘వివియెన్ మార్చెలిన్ జోలీ’గా మార్చాలని కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు పత్రాల్లో ఈ పేరు మార్పుకు గల కారణాన్ని వ్యక్తిగతంగా మాత్రమే పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే జహారా, మాడాక్స్, షిలో తీసుకున్న నిర్ణయాల సరసన వివియెన్ కూడా చేరింది.
ఈ వ్యవహారంపై ఏంజెలీనా జోలీ నేరుగా స్పందించకపోయినా, ఎవరినీ విమర్శించకుండా ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షిలో 2024లో తన పేరు నుంచి “పిట్”ను తొలగించుకుని చట్టబద్ధంగా షిలో జోలీగా మారింది. జహారా తన పేరును జహారా మార్లే జోలీగా, మాడాక్స్ మాడాక్స్ చివాన్ జోలీగా మార్చుకోవాలని పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుతం మాడాక్స్ కేసు విచారణ సెప్టెంబర్ 14న, జహారా కేసు సెప్టెంబర్ 28న జరగనుండగా, వివియెన్ పిటిషన్పై నవంబర్ 2న కోర్టు విచారణ జరగనుంది. కాలిఫోర్నియా చట్టం ప్రకారం అవసరమైన లీగల్ నోటీసులను కూడా వారు ఇప్పటికే సమర్పించడం కూడా జరిగింది. మరోవైపు బ్రాడ్ పిట్ కూడా ఈ అంశంపై నేరుగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే ఆయనకు సన్నిహిత వర్గాలు మాత్రం పిల్లలను తండ్రి నుంచి దూరం చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డాయి. ఇటీవల F1 సినిమా ప్రమోషన్ల సందర్భంగా బ్రాడ్ పిట్ ఫ్యామిలీ, స్నేహితుల గురించి మాట్లాడినప్పటికీ, పిల్లల పేరు మార్పులపై స్పందించలేదు. మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్లతో ఉండటమే ముఖ్యమని ఇప్పుడు మరింతగా అర్థమవుతోందని మాత్రమే ఆయన వ్యాఖ్యానించారు.
ఈ హాలీవుడ్ స్టార్ జంట అధికారికంగా కూడా విడిపోయారు. బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ వివాహం ఆగస్టు 23, 2014న జరిగింది. బెస్ట్ రొమాంటిక్ జంటగా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. 2016లో ఒక ప్రైవేట్ జెట్ ప్రయాణంలో బ్రాడ్ పిట్ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో జోలీ విడాకులకు దరఖాస్తు చేసింది. 2019లో కోర్టు వీరిని చట్టబద్ధంగా విడిపోయినట్లు ప్రకటించినప్పటికీ, పిల్లల కస్టడీ, ఆస్తి పంపకాలపై వివాదాలు కొనసాగాయి. చివరకు దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, డిసెంబర్ 2024లో వీరి విడాకుల ప్రక్రియ పూర్తిగా ముగిసింది. ఈ జంటకు ఉన్న ఆరుగురు పిల్లలు ప్రస్తుతం పెద్దవారయ్యారు, వీరిలో చిన్నవారైన కవలలు కూడా జూలై 2026 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా, జోలీ, బ్రాడ్ పిట్ దంపతుల ఆరుగురు పిల్లల్లో పాక్స్, నాక్స్ కవల సోదరులు మాత్రమే ఇప్పటివరకు పేరు మార్పులో భాగం కాలేదు. అయితే వివియెన్ తీసుకున్న తాజా నిర్ణయం తర్వాత ఈ కుటుంబ వ్యవహారం మళ్లీ అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రానున్న నెలల్లో కోర్టు విచారణలు పూర్తయ్యాక ఈ వ్యవహారంలో మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

