Govinda: 90వ దశకంలో బాలీవుడ్ను తన కామెడీ, డ్యాన్స్, స్టైల్ తో ఏలిన స్టార్ హీరో గోవింద మరోసారి వెండితెరపైకి రాబోతున్నారు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘రూపా’ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాతో నటి రాణి స్వర్ణకర్ బాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న గోవింద, తన రీఎంట్రీతో పాటు కెరీర్లో ఎదుర్కొన్న కష్టాలు, బాలీవుడ్ రాజకీయాలు, దక్షిణాది సినిమాల ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గోవింద మాట్లాడుతూ.. తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, చిన్నప్పటి నుంచి కుటుంబ బాధ్యతలే తనకు ముఖ్యమని, అందుకే అవకాశాల కోసం ఎప్పుడూ ఎదురు చూసేవాడినని వెల్లడించారు. డబ్బు విలువను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడమే తన మొదటి లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద పెద్ద సినీ ప్రముఖుల నుంచి అవకాశాలు ఎక్కువగా రాలేదని, అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాను ఎప్పుడూ భావించానని చెప్పారు.
ఇక దక్షిణాది చిత్రసీమ గురించి కూడా గోవింద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాబోయే పదేళ్లు దక్షిణాది సినిమాలపై దృష్టి పెడతానని వెల్లడించారు. ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ‘వాంటెడ్’, అలాగే అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి హీరోలు నటించిన రీమేక్ చిత్రాల విజయాలను ప్రస్తావిస్తూ, దక్షిణాది కథలు హిందీ సినిమాలకు కొత్త ఊపునిచ్చాయని అన్నారు. ఈ సినిమాల వల్ల ఎంతో మంది హీరోలకు భారీ విజయాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ రాజకీయాలపై కూడా గోవింద తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనను ఇండస్ట్రీలో చాలాసార్లు పట్టించుకోలేదని, ఇకపై సినిమాల్లో కనిపించరని కూడా చాలామంది భావించారని అన్నారు. అయితే అలాంటి పరిస్థితుల్లోనూ తాను వెనక్కి తగ్గలేదని, మళ్లీ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. ప్రేక్షకులు మరోసారి తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందని, ఈ సినిమా తాను మంచి విజయాన్ని అందుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత గోవింద మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అభిమానుల్లో కూడా ఈ సినిమా మీద ఆసక్తి పెరుగుతోంది. ఒకప్పుడు బాలీవుడ్లో వరుస బ్లాక్ బస్టర్లతో నెంబర్ వన్ హీరోగా నిలిచిన ఆయన, ఇప్పుడు ‘రూపా’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

