‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్కు నార్త్లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్లో తన నటనతో అందరినీ మెప్పించారు. ‘అజాగ్రత్త’ సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిరాజ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నేడు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత ఎ ఎం. రత్నం క్లాప్ కొట్టగా..నిర్మాత ఠాగూర్ మధు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో వస్తోన్న ఈ ‘అజాగ్రత్త’ సినిమాలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. రావు రమేష్, సునీల్, ఆదిత్య మీనన్ వంటి వారు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సందీప్ వల్లూరి సినిమాటోగ్రఫర్గా, శ్రీహరి సంగీత దర్శకుడిగా, రవివర్మ ఫైట్ మాస్టర్గా వ్యవహరించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు ఎం శశిధర్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను ఏడు భాషల్లో తెరకెక్కిస్తున్నాం. ఇలాంటి మంచి ప్రొడక్షన్ కంపెనీలో చాన్స్ దొరకడం, రాధిక మేడం అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలు మా టీం మీద చూపించండి’ అని కోరారు.
రాధిక కుమారస్వామి మాట్లాడుతూ, ”ఈ సినిమాకు నేను నిర్మాతగా ఉండాల్సింది. కానీ నేను హీరోయిన్గా ఫిక్స్ అవుతాను అని అనుకోలేదు. ఎవరూ సెట్ అవ్వడం లేదని దర్శకుడు కంగారు పడుతూ ఉన్నారు. నా డేట్స్ కావాలా? అని అడిగాను. స్క్రిప్ట్ విన్నాక షాక్ అయ్యాను. చాలా ఏళ్ల తరువాత ఇలా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతకు, డైరెక్టర్ శశికి థాంక్స్. శ్రేయాస్ ఇది వరకు నటించిన సినిమాలు చూశాను. ఆయన ఎంతో బాగా నవ్విస్తారు. ఈ సినిమాతో పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. శ్రేయాస్ తల్పడే మాట్లాడుతూ, ” ‘అజాగ్రత్త’ టీంకు కృతజ్ఞతలు చెబుతున్నాను. ఈ రెండు పదాలే నేర్చుకున్నాను. త్వరలో తెలుగు నేర్చుకుంటాను. ఈ టీంతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. కరోనా టైంలో ఇండస్ట్రీ ఎంతో మారిపోయింది’ అని అన్నారు.
