Billa Ranga Baasha: భారీ అంచనాల మధ్య ప్రకటించిన కిచ్చా సుదీప్ పాన్ ఇండియా చిత్రం ‘బిల్లా రంగ బాషా’ గురించి ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. చాలా నెలలుగా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఆ అనుమానాలకు చెక్ పెడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘హనుమాన్’ వంటి బ్లాక్బస్టర్ను అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘BRB ఫస్ట్ బ్లడ్ (బిల్లా రంగ బాషా)’ షూటింగ్ జూన్ 26 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. దీంతో సుదీప్ అభిమానుల్లో మళ్లీ భారీ ఉత్సాహం నెలకొంది. త్వరలోనే సినిమా నుంచి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కూడా రానున్నట్లు చిత్ర యూనిట్ సంకేతాలు ఇచ్చింది.
ఈ ప్రాజెక్ట్ను మొదట 2024 సెప్టెంబర్లో అధికారికంగా ప్రకటించగా, 2025 ఏప్రిల్లో ఘనంగా ప్రారంభించారు. అయితే ఆ తర్వాత ఎలాంటి సమాచారం లేకపోవడంతో సినిమా భవిష్యత్తుపై సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు షూటింగ్ పునఃప్రారంభం అవుతుండటంతో అన్ని సందేహాలకు తెరపడినట్టైంది. ‘బిల్లా రంగ బాషా’ కథ పూర్తిగా భవిష్యత్ నేపథ్యంలో సాగే హై కాన్సెప్ట్ యాక్షన్ డ్రామా. క్రీ.శ. 2209 సంవత్సరంలో, విపత్తు అనంతరం మారిపోయిన ప్రపంచాన్ని ఈ సినిమా చూపించబోతోంది. భారతీయ సినిమాల్లో అరుదుగా కనిపించే పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచాన్ని భారీ విజువల్ స్కేల్తో ఆవిష్కరించేందుకు దర్శకుడు సిద్ధమయ్యారు.
ఈ చిత్రానికి గతంలో ‘విక్రాంత్ రోనా’తో సుదీప్కు భారీ విజయాన్ని అందించిన అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తుండటం విశేషం. నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘హనుమాన్’ విజయంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు మరింత భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ను రూపొందిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్, ఫ్యూచరిస్టిక్ వరల్డ్ బిల్డింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. షూటింగ్ మళ్లీ ప్రారంభం కావడంతో త్వరలోనే ఫస్ట్ లుక్, టీజర్ లేదా ఇతర ప్రమోషనల్ అప్డేట్స్ వచ్చే అవకాశముందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

