NTV Telugu Site icon

Bheemla Nayak : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

Bheemla-Nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న “భీమ్లా నాయక్”లో నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా విడుదలకు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈరోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించాల్సి ఉంది. సాయంత్రం 8 గంటలకు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా చెప్పడంతో మెగా అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరికీ షాకిస్తూ తాజాగా ‘భీమ్లా నాయక్’ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.

Read Also : Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్

“ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి ఆకస్మిక మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన మృతికి గౌరవ సూచకంగా #Bheemlanayak ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు జరగదు” అంటూ సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా నిరాశపడిపోయారు. తరువాతైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా? ట్రైలర్ సంగతేంటి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.