Bhagamathi Director Gudluri Ashok Babu Case: తెలుగు సినీ పరిశ్రమలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యువకుడిని హీరోగా పరిచయం చేస్తానని నమ్మించి కోట్ల రూపాయలు తీసుకున్నారనే ఆరోపణలతో ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ పోలీసుల ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో నిర్మాత విజయలక్ష్మిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. బాధిత యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
తన కుమారుడిని సినీ హీరోగా పరిచయం చేస్తానని హామీ ఇచ్చిన దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు.. పలు దఫాలుగా మొత్తం రూ.3.5 కోట్లను తీసుకున్నారని హనుమంతరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మాట ఇచ్చినట్లుగా సినిమాను ప్రారంభించకపోవడమే కాకుండా.. తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మిని విచారణకు ఆదేశించారు. డబ్బు లావాదేవీలు, సినిమా నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు, ఇతర ఆధారాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
గుడ్లూరి అశోక్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆకాశరామన్న’, ‘పిల్ల జమీందార్’, ‘భాగమతి’ వంటి చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. అలాంటి దర్శకుడిపై ఇప్పుడు ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మి ఎలా స్పందిస్తారో చూడాలి.

