అక్టోబర్ 10న “మా” ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.. అయితే ‘మా’ వ్యవహారం టాలీవుడ్ లో కొత్త వివాదాలను తెర మీదకు తెస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధ్యక్ష బరిలో ఉన్న ప్రకాశ్ రాజ్ కు మద్దతుగా నిలిచిన బండ్ల గణేష్ ఇప్పుడు స్వతంత్రంగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్నారు. తొలుత జీవిత, హేమ సైతం అధ్యక్ష బరిలో పోటీ చేయాలని భావించారు. అయితే, ప్రకాశ్ రాజ్ వ్యూహాత్మకంగా జీవిత, హేమతో చర్చలు జరిపి వారిద్దరిని తన ప్యానెల్ లో చేర్చుకున్నారు. జీవితను ప్రధాన కార్యదర్శి పదవికి బరిలో దింపాలని నిర్ణయించారు. అయితే దీనిపై తాజాగా మరోసారి బండ్ల గణేష్ స్పందించారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘అనుకోని వారు కొందరు వచ్చినందుకే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బయటకు వచ్చాను. అందుకే ఇప్పుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా మాట్లాడాను. ప్రకాష్ రాజ్ 10 కోట్ల ఫండ్ తెస్తే.. నేను 11 కోట్లు తీసుకొస్తాను. ‘మా’ ఎన్నికల్లో భాగంగా.. ఓటు కావాలంటే ఫోన్ చేసి, మీరు ఏయే అభివృద్ధి పనులు చేస్తారో చెప్పండని సూచించారు. అంతేకానీ ఇలా విందుల పేరుతో ఒక చోట చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమడోద్దని బండ్ల తెలిపారు. విష్ణు గురించి ఎమన్నా మాట్లాడతారా ? అని అడగ్గా, ఆ.. అల్ ది బెస్ట్ విష్ణుగారు..!’ అంటూ బండ్ల సమాధానం ఇచ్చారు.
అయితే, అధ్యక్ష బరిలో నిలుస్తామని చెప్పిన వారిలో ముగ్గురు సభ్యులు డ్రాప్ అవ్వటంతో…ఇక, ఇప్పుడు ప్రధాన పోరు ప్రకాశ్ రాజ్ వర్సెస్ విష్ణుగా జరగనుంది. విష్ణు తన ప్యానెల్ సభ్యులను ప్రకటించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో ఆయన తన ప్యానల్ ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక, ఇద్దరూ తమ ప్యానెల్ తో ప్రచారం ప్రారంభిస్తే, మా ఎన్నికల వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.