ప్రముఖ నటుడు, దర్శకుడు స్వర్గీయ ఏవీయస్ తనయుడు ప్రదీప్ సైతం తండ్రి బాటలోనే సాగుతున్నాడు. ఇప్పటికే కొన్ని సినిమాలలో నటించిన ఎ. ప్రదీప్ ఇప్పుడు దర్శకుడిగానూ మారాడు. ఖయ్యూమ్, నవీన్ నేని, రోయిల్ శ్రీ, చింటు, శాంతి దేవగుడి, రామ్ జగన్, ‘చిత్రం’ శ్రీను ప్రధాన పాత్రధారులుగా ప్రదీప్ ‘భళా చోర భళా’ అనే సినిమాను తెరకెక్కించారు. యాక్టివ్ స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతోన్న ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ను ఎ. జనని ప్రదీప్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 26న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మీడియా సమావేశం నిర్వహించారు. అందులో నటుడు ఆలీ సోదరుడు ఖయ్యుమ్ మాట్లాడుతూ, ”ఇది కంప్లీట్ నెపోటీజమ్ మూవీ అనొచ్చు! ఎందుకంటే ఇందులో అందరం సీనియర్ ఆర్టిస్టులకు సంబంధించిన వాళ్ళమే ఉన్నాం. ప్రదీప్ నాకు ఏవీఎస్గారి అబ్బాయిగా 20ఏళ్ల క్రితమే తెలుసు. మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఆ స్నేహంతోనే ఇద్దరం కలిసి వర్క్ చేయాలనుకున్నాం. కోవిడ్ టైం లోనే ప్రదీప్ నాకు స్టోరీ చెప్పారు. వినగానే నాకు బాగా నచ్చింది. కథ నచ్చిన రెండో రోజే షూటింగ్ అన్నాడు. 9 డేస్, 8 నైట్స్ లో షూట్ కంప్లీట్ చేసి, రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా పూర్తి చేసి రిలీజ్కి సిద్ధం చేశాడు. ఇది మంచి సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు. ‘అవును’ ఫేమ్ చంటి తాను ఇందులో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నట్టు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరినీ డిజప్పాయింట్ చేయదని చంటి హామీ ఇస్తున్నాడు. డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ, ”లిమిటెడ్ బడ్జెట్ తో లిమిటెడ్ డేస్లో మంచి సినిమా చేయాలని ప్లాన్ చేశాను. అదే ‘భళా చోర భళా’గా మీ ముందుకు రాబోతోంది. మా నాన్న ఏవీయస్ గారిపై ఉన్న అభిమానంతో సినిమా వారందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఆయన లేకపోయినా మాకు ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ సినిమాను ఆగస్ట్ 26న మా అమ్మగారి పుట్టినరోజు కానుకగా విడుదల చేస్తున్నాం” అని అన్నారు.
