అషూ రెడ్డి చుట్టూ అల్లుకున్న వివాదానికి సంబంధించి తాజాగా హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక ఎన్ఆర్ఐ ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా అషూ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టులో వినిపించిన వాదనలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఈ వివాదంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం.. నిందితుడు ఆరోపిస్తున్న భారీ మొత్తం. అయితే, సదరు ఎన్ఆర్ఐ తనంతట తానుగా, ఎటువంటి బలవంతం లేకుండానే దాదాపు ₹9.35 కోట్లు ఖర్చు చేశారని అషూ రెడ్డి కోర్టుకు తెలిపారు. తనను, తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించే క్రమంలో, ప్రసన్నం చేసుకోవడానికే ఆయన స్వచ్ఛందంగా ఈ మొత్తాన్ని వెచ్చించారని ఆమె పేర్కొన్నారు.
ఇద్దరి మధ్య ఎటువంటి లిఖితపూర్వక అగ్రిమెంట్ లేనప్పుడు, కేవలం ఆర్థిక లావాదేవీలు జరిగినంత మాత్రాన అది క్రిమినల్ నేరం కిందకు రాదని ఆమె వాదించారు. ఫిర్యాదుదారుడు తన వ్యక్తిగత నిర్ణయంతో చేసిన ఖర్చులకు అషూ రెడ్డి కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ బాధ్యులు కారని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఖర్చుకు తమకు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. సీసీఎస్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎటువంటి వాస్తవాలు లేవని, అందుకే ఆ కేసును కొట్టివేయాలని ఆమె అభ్యర్థించారు. ఈ వాదనలను విన్న హైకోర్టు, కేసు లోటు పాట్లను పరిశీలించేందుకు సిద్ధమైంది. అషూ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై పూర్తి వివరాలను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ కౌన్సిల్ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నివేదికను తదుపరి విచారణలోగా అందించాలని కోరింది. ఈ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున ప్రభుత్వం సమర్పించే వివరాలను బట్టి అషూ రెడ్డిపై ఉన్న ఎఫ్ఐఆర్ కొనసాగుతుందా లేదా కొట్టివేయబడుతుందా అనేది తేలనుంది.
