సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.ఎఫ్డిసితో ఒప్పందం చేసుకోవాలని, ప్రొవైడర్ గేట్వే ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోర్టల్ సినిమా విడుదలకు ముందే బుకింగ్ స్లాట్లను నిర్వహించనుంది.
రిలీజ్ కి ఒక వారం ముందు థియేటర్లు ఈ పోర్టల్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ విక్రయించాలి. అయితే మల్టీప్లెక్స్ చైన్స్ తో పాటు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. ఈ పోర్టల్ నిర్వహణకు ప్రతి టికెట్ పై రెండు శాతం కనీస సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనుంది. త్వరలోనే వెబ్ పోర్టల్ లాంచ్ వివరాలు తెలియచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలుపై 8 నుంచి 10 శాతం వరకూ కమీషన్ వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పోర్టల్ అందుబాటులోకి వస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం లభించటంతో పాటు ప్రేక్షకులకు కూడా తక్కువ ఖర్చులోనే రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నమాట.
