Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!

Amitabh Bachchan

Amitabh Bachchan

Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను వరుసగా విస్తరిస్తున్నారు. గత కొన్నేళ్లలో ఆయన రామనగరిలో రూ.100 కోట్లకు పైగా విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో అయోధ్యలో అత్యధిక స్థాయిలో పెట్టుబడులు పెట్టిన ప్రముఖ సినీ సెలబ్రిటీల్లో అమితాబ్ బచ్చన్ అగ్రస్థానంలో నిలిచారు. హిందుస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం.. 2026 మార్చిలో ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా (HoABL)’ నుంచి అమితాబ్ బచ్చన్ 2.67 ఎకరాల భూమిని రూ.35 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ స్థలం HoABL అభివృద్ధి చేస్తున్న 75 ఎకరాల విలాసవంతమైన ‘ది సరియు’ ప్రాజెక్ట్‌కు సమీపంలో ఉంది. ఇదే డెవలపర్‌తో ఆయన చేసిన మూడో ప్రధాన ఇన్వెస్ట్‌మెంట్‌గా పేర్కొంటున్నారు.

అంతకుముందు 2025 మే నెలలో ‘ది సరియు’ ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను సుమారు రూ.40 కోట్లకు అమితాబ్ సొంతం చేసుకున్నారు. అలాగే 2025 మార్చిలో రామ మందిరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న 54,454 చదరపు అడుగుల భూమిని ‘హరివంశ్ రాయ్ బచ్చన్ ట్రస్ట్’ పేరిట కొనుగోలు చేశారు. ఈ స్థలంలో తన తండ్రి, ప్రముఖ కవి డాక్టర్ హరివంశ్ రాయ్ బచ్చన్ స్మారకార్థం ఓ భారీ స్మారక నిర్మాణాన్ని చేపట్టే ఆలోచనలో బిగ్ బీ ఉన్నట్లు సమాచారం. ఇక 2024లో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముందు కూడా అమితాబ్ బచ్చన్ అయోధ్యలో వరుస పెట్టుబడులు పెట్టారు. HoABL అభివృద్ధి చేస్తున్న ‘ది సరియు’ ప్రాజెక్ట్‌లోని 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.14.5 కోట్లకు కొనుగోలు చేశారు. అదే ఏడాది జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవానికి కొద్ది రోజుల ముందు ‘హవేలీ అవధ్’ ప్రాజెక్ట్‌లో 5,372 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.4.54 కోట్లకు సొంతం చేసుకున్నారు. అయోధ్యలో ఆయన చేసిన తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి ఇదే. వరుసగా భూములు కొనుగోలు చేస్తూ అయోధ్యలో తన పెట్టుబడులను పెంచుకుంటున్న అమితాబ్ బచ్చన్, రామనగరి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై తన విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.