NTV Telugu Site icon

చిరు సినిమాతో మణిశర్మ కొడుకు హవా మొదవుతుందా!?

మెగాస్టార్ చిరంజీవి, మణిశర్మ ది హిట్ కాంబినేషన్. ‘బావగారు బాగున్నారా!’ మొదలు ‘చూడాలని వుంది, అన్నయ్య, ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ, స్టాలిన్’ వంటి ఎన్నో సినిమాలను సూపర్ హిట్ పాటలతో బంపర్ హిట్ గా మార్చాడు మణిశర్మ. తాజాగా ‘ఆచార్య’తో ఈ ఇద్దరు మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మణిశర్మ కుమారుడు మహతి సాగర్ తొలిసారి చిరంజీవితో పని చేయబోతున్నాడట. ‘వేదాళం’ రీమేక్ గా మెహర్ రమేశ్ తీస్తున్న ‘భోళా శంకర్’ సినిమాకు మణి కొడుకు సాగర్ ని సంగీత దర్శకుడుగా ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇప్పటికే ‘ఆచార్య’లో విడుదలైన పాటలతో తనదైన మార్క్ చూపించిన మణిశర్మకు ఈ వార్త ఎంతో ఆనందాన్ని ఇస్తుందనటంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో ‘లూసిఫర్’ రీమేక్ గా ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నాడు. దానికి తమన్ సంగీత దర్శకుడు. దాని తర్వాత మెహర్ రమేష్‌తో ‘భోలా శంకర్’ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేయడానికి మహతి స్వర సాగర్‌ సిద్ధం అవుతున్నారు. మహతి ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించారు. ఇవి మ్యూజికల్ గా కూడా హిట్ అయ్యాయి. తండ్రిలాగే మెలోడి ట్యూన్స్ ఇవ్వటంలో దిట్ట మహతి సాగర్. దీంతో మెగాభిమానులు మణిశర్మ లాగే మహతి సాగర్ కూడా తమ బాస్ కి సూపర్ హిట్ మ్యూజిక్ అందిస్తాడనే ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి వారి ఆశకు తగినట్లు, తండ్రి ఆశయాలకు అనుగుణంగా చిరుకు సూపర్ మ్యూజిక్ ఇచ్చి తన దైన మార్క్ సృష్టిస్తాడేమో చూడాలి.