నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన, వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సంప్రదాయానీ సుప్పీనీ శుద్ధపూసనీ’ అనే సినిమా మార్చి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాలు నిలిపివేసిన తర్వాత రొటేషన్ కోసం స్థలాలు కొని అమ్మడం లాంటివి చేసేవాడినని చెప్పుకొచ్చారు. అలా యాదగిరిగుట్ట దగ్గరలో 70,000 రూపాయలకు ఎకరం చొప్పున కొన్న తాను, ఒక్కొక్క ఎకరం 9 లక్షలకు అమ్మినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆ స్థలం ధర బాగా పెరిగిపోయిందని అన్నారు.
Also Read:Raja Saab: రాజాసాబ్ ఫ్లాప్ కలిసొచ్చిందా?
అంతేకాక, ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్రదేశంలో సుమారు 18 ఎకరాలు కొని, ఆ తర్వాత తక్కువ లాభానికే అమ్మినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అప్పుడు రొటేషన్ కోసం అలా చేశాను కానీ, ఇప్పుడు అక్కడ అదే స్థలం ఉండి ఉంటే ఒక్కొక్క ఎకరం 100 కోట్లు పలికేదని, అంటే దాదాపుగా తాను 1800 కోట్లు నష్టపోయానంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటికి తాను రొటేషన్ గురించి మాత్రమే ఆలోచించేవాడినని, కానీ ఇంతగా ధరలు పెరిగిపోతాయనే ఆలోచన తనకు లేదని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద శివాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏకంగా 1800 కోట్లు నష్టపోయానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
