మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. అయితే దీనిని హిందీలోనూ డబ్ చేసి అదే రోజున విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని హిందీలో సినిమాను పంపిణీ చేయబోతున్న పెన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ సినిమాలు ఇప్పుడు వరుసగా విడుదల కాబోతున్నాయి. గత శుక్రవారం తెలుగు ‘ఖిలాడీ’ని పెన్ సంస్థ హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేసింది.
ఇక స్ట్రయిట్ హిందీ సినిమాలు ‘గంగుభాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఇక దేశమంతా ఎదురుచూస్తున్న ‘ట్రిపుల్ ఆర్’ హిందీలోనూ మార్చి 25న విడుదల కాబోతోంది. ఆ తర్వాత ‘అటాక్ పార్ట్ 1’ను ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నారు. తెలుగు ‘జెర్సీ’ హిందీ రీమేక్ ను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. అలానే ‘ఆచార్య’ హిందీ వర్షెన్ ను 29న విడుదల చేస్తున్నామని పాన్ స్టూడియోస్ సంస్థ తెలిపింది. మరి ‘ఆచార్య’ను మిగిలిన సౌతిండియన్ లాంగ్వేజెస్ లోనూ అదే రోజున రిలీజ్ చేసే విషయాన్ని నిర్మాతలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో చూడాలి!
