AAA Cinemas Officially Launched: ఒకపక్క సినిమా హీరోగా రాణిస్తూ ఐకాన్ స్టార్ గా మారి ప్యాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న అల్లు అర్జున్ మరోపక్క పలు వ్యాపారాలు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు రెస్టారెంట్లు నడుపుతున్న ఆయన ఏషియన్ సినిమాస్ తో కలిపి ఒక మల్టీప్లెక్స్ కి కూడా ఓనర్ అయ్యారు.
గతంలో అమీర్పేట్ సెంటర్లో సత్యం థియేటర్ పాతబడి పోవడంతో దాన్ని తొలగించి అదే స్థానంలో ఏషియన్ సత్యం మాల్ ను నిర్మించారు. దీనిలో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ సహా సదానంద గౌడ్, మురళీమోహన్ భాగస్వాములుగా ఉన్నారు. నిన్న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మాల్ కి సంబంధించిన మల్టీప్లెక్స్ ను ఈ రోజు అల్లు అర్జున్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి అల్లు అర్జున్ రిబ్బన్ కట్ చేశారు. ఇక ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కుమారుడు అల్లు ఆయాన్ష్ కూడా హాజరయ్యారు.
ఇక ఈ మల్టీప్లెక్స్ లో మొత్తం ఐదు థియేటర్లు ఉన్నాయి. రెండు థియేటర్లు ఎక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి కాగా మూడు థియేటర్లు మాత్రం కాస్త తక్కువ సీటింగ్ కెపాసిటీ కలిగినవి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైదరాబాదులో ఇప్పటివరకు లేనివిధంగా ఒక ఎల్ఈడీ స్క్రీన్ ను కూడా ఏఏఏ సినిమాస్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈరోజు ఓపెనింగ్ జరగడంతో రేపు ఆదిపురుష్ సహా పలు సినిమాల బుకింగ్స్ గట్టిగా జరుగుతున్నాయి.