NTV Telugu Site icon

Yatra 2: తండ్రికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న కొడుకుగా చరిత్ర నన్ను గుర్తు పెట్టుకుంటుంది

Yatra 2

Yatra 2

మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ముఖ్యఘట్టాలతో తెరకెక్కిన సినిమా యాత్ర. మహి వీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రాజశేఖర్ రెడ్డిగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈయన రాకతో యాత్ర సినిమా మరింత గొప్పగా మారింది. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ని టార్గెట్ చేస్తూ యాత్ర 2 రెడీ అవుతుంది. వై.ఎస్‌.జ‌గ‌న్‌ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఫిబ్రవరి 8న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మేకర్స్ ‘యాత్ర 2’ టీజర్‌ను విడుదల చేశారు.

టీజర్‌ను గమనిస్తే…వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అదే సందర్భంలో తండ్రిలాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఆ అడ్డంకులను జగన్ ఎలా అధిగమనించారు.. తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే ‘యాత్ర 2’ సినిమా. 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్ర‌జాద‌ర‌ణను పొందిన ఈ చిత్రంకు కొన‌సాగింపుగా ‘యాత్ర 2’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. యాత్ర సినిమాను ఫిబ్ర‌వ‌రి 8, 2019లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది.