Vegetable Cleaning : మనం సాధారణంగా మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలను వండే ముందు నీటితో కడుగుతాము. అయితే కేవలం కొన్ని సెకన్ల పాటు సాధారణ నీటితో కడగడం వల్ల పూర్తి రక్షణ లభించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయల ఉపరితలంపై మట్టి, దుమ్ముతో పాటు ప్రమాదకరమైన పురుగుమందుల (Pesticides) అవశేషాలు కూడా ఉండే అవకాశం ఉంది. వీటిని సమర్థవంతంగా తొలగించడానికి మన ఇంట్లో సులభంగా లభించే ఉప్పును ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. ఉప్పు నీటితో కడగడం వల్ల కూరగాయల రుచి, నాణ్యతలో ఎలాంటి మార్పు ఉండదు.
ఉప్పు నీటితో కలిగే ఉపయోగాలు
ఉప్పు నీరు ఒక తేలికపాటి హైపర్టోనిక్ ద్రావణంగా పనిచేస్తుంది. ఇది కూరగాయల ఉపరితలంపై ఉండే దుమ్ము, చిన్న చిన్న పురుగులు , పురుగుమందుల అవశేషాలను సులభంగా విడదీస్తుంది. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర వంటి కూరగాయల రంధ్రాలలో ఇరుక్కుపోయిన మురికిని తొలగించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఉప్పు నీరు కేవలం ఉపరితలంపై ఉన్న మురికిని మాత్రమే తొలగిస్తుందని గమనించాలి.
కూరగాయలను శుభ్రం చేయడానికి 5 సులభమైన దశలు
ముందుగా ఒక పెద్ద గిన్నెలో శుభ్రమైన నీటిని తీసుకుని, ప్రతి లీటరు నీటికి 1 నుండి 2 టీస్పూన్ల ఉప్పు వేసి బాగా కరిగించాలి. ఆ తర్వాత కూరగాయలను ఉప్పు నీటిలో వేయడానికి ముందే, ఒకసారి పారుతున్న కుళాయి నీటి కింద కడగడం వల్ల పైపైన ఉండే మట్టి తొలగిపోతుంది.
అనంతరం కూరగాయలను తయారైన ఉప్పు నీటిలో వేసి 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆకుకూరలను విడిగా నానబెట్టడం వల్ల వాటి కాడలకు ఉండే మట్టి తేలిగ్గా వదులుతుంది. బంగాళాదుంపలు, దోసకాయలు వంటి గట్టి తొక్క ఉన్న కూరగాయలను మెల్లగా రుద్ది కడగవచ్చు. చివరగా ఉప్పు నీటి నుండి తీసిన కూరగాయలను మరోసారి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. దీనివల్ల ఉప్పు రుచి , మిగిలి ఉన్న మురికి పూర్తిగా తొలగిపోతాయి. వండే ముందు లేదా ఫ్రిజ్లో నిల్వ చేసే ముందు కూరగాయలపై తేమ లేకుండా ఆరబెట్టుకోవడం మంచిది.
ఏ కూరగాయలకు ఉప్పు నీటి క్లీనింగ్ బెటర్?
పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలకు, క్యాబేజీ , కాలీఫ్లవర్లకు ఉప్పు నీటి శుభ్రత చాలా అవసరం. అలాగే దోసకాయ, వంకాయ, క్యాప్సికమ్ వంటి గట్టి తొక్క కలిగిన కూరగాయలకు , నేలకు దగ్గరగా పెరిగే పంటలకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. క్యాబేజీ, కాలీఫ్లవర్లను చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల లోపల ఉండే పురుగులు బయటకు వచ్చేస్తాయి.
గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు.. పరిశోధనలు
2022లో ప్రచురితమైన ‘ఫుడ్స్’ అధ్యయనం ప్రకారం, కూరగాయలను పారే నీటి కింద క్షుణ్ణంగా కడగడం వల్ల పురుగుమందుల అవశేషాలు అత్యధికంగా తొలగిపోతాయి. అయితే కూరగాయలను శుభ్రం చేయడానికి సబ్బులు లేదా డిటర్జెంట్లను అస్సలు ఉపయోగించకూడదు. అలాగే ఉప్పు నీటిలో పరిమితికి మించి ఎక్కువ సేపు నానబెడితే లేత ఆకుకూరలు వాడిపోయే ప్రమాదం ఉంది.
ఉప్పు నీటి శుభ్రత కేవలం కూరగాయల ఉపరితలంపై ఉన్న క్రిములు, పురుగుమందులను మాత్రమే తొలగిస్తుందని, కణజాలాల లోపలికి చొచ్చుకుపోయిన రసాయనాలను తొలగించలేదని గుర్తుంచుకోవాలి. కాబట్టి తొక్క తీసి వాడటం, బయటి ఆకులను తొలగించడం , నమ్మకమైన ప్రదేశాల నుండి కూరగాయలను కొనుగోలు చేయడం మంచిది.

